Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ ఏర్పాటు

Nara Lokesh initiates Feedback Committee for Telugu Desam Party
  • కార్యకర్తల నుంచి నేరుగా సమాచారం సేకరించేలా కొత్త వ్యవస్థ
  • మంత్రి నారా లోకేశ్ దిశానిర్దేశంతో ఫీడ్ బ్యాక్ కమిటీ ఏర్పాటు
  • మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు నేతృత్వంలో త్రిసభ్య బృందం
  • సోషల్ మీడియాలో బహిరంగ విమర్శలకు చెక్ పెట్టేలా కార్యాచరణ
  • అధిష్ఠానం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు
తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం పరిపాలనలోనే కాకుండా పార్టీ నిర్వహణలోనూ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పార్టీకి వెన్నెముకగా నిలిచే కార్యకర్తల మనోభావాలను నేరుగా తెలుసుకునేందుకు, వారి సూచనలను పరిగణనలోకి తీసుకునేందుకు మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచనల మేరకు ప్రత్యేకంగా ఒక 'ఫీడ్ బ్యాక్ కమిటీ'ని ఏర్పాటు చేసింది. క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం.

పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు నేతృత్వంలో ఈ త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. కార్యకర్తలకు, నాయకత్వానికి మధ్య ఉన్న అగాధాన్ని తగ్గించి, సాధారణ కార్యకర్త అభిప్రాయం కూడా నేరుగా లీడర్‌కు చేరేలా ఈ వ్యవస్థ పని చేయనుంది. ఇటీవల కాలంలో కొందరు పార్టీ శ్రేణులు తమ అసంతృప్తిని లేదా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తమ అభిప్రాయాలను బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇది పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించడమే కాకుండా, ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతోందని అధిష్టానం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే పార్టీని ఒక కుటుంబంగా భావిస్తూ, సమస్యలను అంతర్గతంగానే చర్చించుకుని పరిష్కరించుకునేందుకు ఈ వేదికను అందుబాటులోకి తెచ్చారు.

ఈ కొత్త విధానంలో భాగంగా కమిటీ తన పనిని వేగవంతం చేసింది. తాజాగా పామర్రు నియోజకవర్గానికి చెందిన, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఒక కార్యకర్తతో ఈ ఫీడ్ బ్యాక్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. సదరు కార్యకర్త నుంచి క్షేత్ర స్థాయి పరిస్థితులు, పార్టీ బలోపేతానికి అవసరమైన సలహాలను కమిటీ సభ్యులు సావధానంగా విన్నారు. "పార్టీలో ఏవైనా లోపాలు ఉన్నా, లేదా మంచి సలహాలు ఇవ్వాలనుకున్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. నేరుగా మా కమిటీ దృష్టికి తీసుకురండి. మీ అభిప్రాయాన్ని యథాతథంగా అధినాయకత్వానికి చేరవేస్తాం" అని కమిటీ చైర్మన్ సత్యనారాయణ రాజు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

Nara Lokesh
Telugu Desam Party
TDP
Feedback Committee
Satyanarayana Raju
Party cadre
Andhra Pradesh Politics
Political strategy
Party strengthening
Pamurru constituency

More Telugu News