రేపు ఇంగ్లండ్‌తో సెమీస్... టీమిండియా ఫీల్డింగ్ పై కోచ్ ఆందోళన

  • టీ20 ప్రపంచకప్ సెమీస్‌కు ముందు భారత జట్టును వేధిస్తున్న ఫీల్డింగ్ సమస్యలు
  • ఈ టోర్నీలో ఇప్పటివరకు మొత్తం 13 క్యాచులు జారవిడిచిన భారత ఫీల్డర్లు
  • ప్రత్యర్థులకు అదనంగా 15-20 పరుగులు ఇస్తున్నామని అంగీకరించిన కోచ్
టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్, మరోసారి టైటిల్ వేటలో కీలక ఘట్టానికి చేరుకుంది. రేపు (గురువారం) ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ పోరుకు టీమిండియా సిద్ధమవుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు జట్టును ఫీల్డింగ్ వైఫల్యాలు, బౌలింగ్ ఆందోళనలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పలు కీలక విషయాలను పంచుకున్నాడు.

ప్రధానంగా జట్టు ఫీల్డింగ్ తీరుపై మోర్కెల్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ టోర్నీలో భారత జట్టు ఇప్పటివరకు ఏకంగా 13 క్యాచ్‌లను జారవిడిచిందని గుర్తు చేశాడు. "నిజాయతీగా చెప్పాలంటే, ఫీల్డింగ్ లోపాల వల్ల మనం ప్రత్యర్థికి అదనంగా 15-20 పరుగులు ఇస్తున్నాం. సెమీఫైనల్ వంటి పెద్ద మ్యాచ్‌లలో క్యాచ్‌లు జారవిడచడం అంటే ప్రపంచకప్ ట్రోఫీని జారవిడిచినట్టే" అని హెచ్చరించాడు. అభిషేక్ శర్మ, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు సులువైన క్యాచ్‌లను నేలపాలు చేయడంపై జట్టు దృష్టి సారించిందని, ఆటగాళ్లు తమ తప్పులను సరిదిద్దుకుంటున్నారని తెలిపాడు.

ఇక బౌలింగ్ విభాగంలో గత కొన్ని మ్యాచ్‌లలో ప్రత్యర్థులు టీమిండియాపై 170కి పైగా పరుగులు చేయడంపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై స్పందించిన మోర్కెల్, బౌలర్లను సమర్థించాడు. వికెట్లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రత్యర్థిని 120 లేదా 150 పరుగులకే కట్టడి చేయలేమని, అయినా తాము చాలా మ్యాచ్‌ల్లో విజయాలు సాధించామని అన్నాడు. అలాగే ఓపెనర్ అభిషేక్ శర్మ, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్‌పై ఆందోళన అవసరం లేదని, వారిద్దరూ నాణ్యమైన ఆటగాళ్లని కోచ్ వెనకేసుకొచ్చాడు.

పిచ్, వాతావరణం గురించి మాట్లాడుతూ.. భారత్‌లో వేడి, తేమ ఎక్కువగా ఉన్నాయని, పిచ్ పొడిబారకుండా గ్రౌండ్ సిబ్బంది నీరు చల్లుతున్నారని మోర్కెల్ పేర్కొన్నాడు. పిచ్ ఎలా స్పందిస్తుందో మ్యాచ్ రోజు ఉదయమే తెలుస్తుందని అన్నాడు. అయితే పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నా, తమ దూకుడు వైఖరిలో మార్పు ఉండదని, సహజసిద్ధమైన గేమ్ ఆడుతూనే ఫైనల్ చేరడానికి ప్రయత్నిస్తామని మోర్కెల్ స్పష్టం చేశాడు.




More Telugu News