సంజూను చూసిన తర్వాత 'ఛేజింగ్ మాస్టర్' అనిపించాడు: పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ

  • వెస్టిండీస్‌పై సంజు శాంసన్ ఇన్నింగ్స్‌పై ప్రశంసలు
  • పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు
  • సంజు బ్యాటింగ్‌లో తనకు విరాట్ కోహ్లీ కనిపించాడన్న బసిత్
  • అతడు మరో 'ఛేజింగ్ మాస్టర్' అంటూ కితాబు
  • స్పష్టమైన ప్రణాళికతో గేర్లు మార్చుతూ ఆడాడని విశ్లేషణ
టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై అద్భుతమైన అజేయ ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలిపించిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత మాజీ ఆటగాళ్లతో పాటు, పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కూడా అతడి ఆటతీరుకు ముగ్ధులవుతున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ, సంజు బ్యాటింగ్‌ను ఆకాశానికెత్తారు. సంజు ఆడుతున్నప్పుడు తనకు విరాట్ కోహ్లీ కనిపించాడని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

బసిత్ అలీ మాట్లాడుతూ.. సంజు బ్యాటింగ్‌ను నిశితంగా గమనిస్తే విరాట్ కోహ్లీ ఆటతీరు స్పష్టంగా కనిపించిందన్నారు. పేస్, స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని పరుగులు రాబట్టాడని పేర్కొన్నారు. చాలా స్పష్టమైన ప్రణాళికతో బరిలోకి దిగి,  పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి, ఆ తర్వాత పరిస్థితికి తగ్గట్టు తన ఆటను మార్చుకున్న తీరు అద్భుతమని విశ్లేషించారు. 

ఈ ఇన్నింగ్స్ చూసిన తర్వాత సంజును 'ఛేజింగ్ మాస్టర్' అనొచ్చని, సాధారణంగా ఈ మాటను విరాట్ కోహ్లీ కోసం వాడతాము కానీ ఈ మ్యాచ్‌లో సంజు ఆడిన విధానం ఆ బిరుదుకు న్యాయం చేసిందన్నారు. ఎవరి బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకోవాలి, ఎప్పుడు గేర్లు మార్చాలి, బంతిని ఏ ప్రదేశానికి పంపాలి అనే విషయాల్లో అతడికి పూర్తి స్పష్టత ఉందని, దాని ప్రకారం తన ప్రణాళికను అమలు చేశాడని బసిత్ అలీ కొనియాడారు.


More Telugu News