Rahul Gandhi: ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం

Rahul Gandhi Meets Telangana AP Congress Leaders
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీఏసీల సంయుక్త భేటీకి రాహుల్ గాంధీ
  • డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరంలో పాల్గొని దిశానిర్దేశం
  • తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికలపై ప్రధానంగా చర్చ
  • అభ్యర్థుల ఎంపికపై కసరత్తు.. రేసులో పలువురు సీనియర్ నేతలు
  • రెండు సీట్లు గెలుచుకోవడంపై ధీమాతో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ ఇవాళ‌ తెలంగాణలో పర్యటించారు. తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ పార్టీల రాజకీయ వ్యవహారాల కమిటీల (పీఏసీ) సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వికారాబాద్‌లోని ఎస్‌ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఈ సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత బలోపేతం, ముఖ్యంగా తెలంగాణలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలపై ఈ పర్యటనలో ప్రధానంగా చర్చలు జరిగాయి.

ఇవాళ ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం రేవంత్‌తో కలిసి ఆయన వికారాబాద్‌కు బయలుదేరారు. వికారాబాద్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాహుల్‌కు స్వాగతం పలికారు.

పీఏసీ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ అనంతగిరి హిల్స్‌లోని హరిత రిసార్ట్‌కు వెళ్లారు. అక్కడ తెలంగాణ, ఏపీకి చెందిన నూతన డీసీసీ అధ్యక్షుల కోసం ఏర్పాటు చేసిన 10 రోజుల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించి, పార్టీని బలోపేతం చేయడానికి సమర్థవంతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

ఈ పర్యటనలో భాగంగా తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికలపై రాహుల్ గాంధీ రాష్ట్ర నాయకత్వంతో చర్చించారు. ఈ నెల‌ 16న ఎన్నికలు జరగనుండగా, నామినేషన్ల దాఖలుకు 5 చివరి తేదీ. కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్యామ్ మోహన్ అనంతుల, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వి. హనుమంతరావు, ప్రణాళికా సంఘం ఛైర్మన్ జి. చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండరెడ్డి తదితరులు రాజ్యసభ టికెట్లను ఆశిస్తున్నారు.

ప్రస్తుతం సిట్టింగ్ సభ్యులుగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీ, కేఆర్ సురేశ్ రెడ్డి పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 66 మంది ఎమ్మెల్యేలు, మిత్రపక్షం సీపీఐకి ఒకరు, స్నేహపూర్వక పార్టీ ఎంఐఎంకు ఏడుగురు సభ్యుల మద్దతు ఉండటంతో రెండు స్థానాలనూ సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. సింఘ్వీని మళ్లీ నామినేట్ చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అభ్యర్థులపై అధికారిక ప్రకటన ఈ నెల‌ 4న వెలువడే అవకాశం ఉంది.
Rahul Gandhi
Telangana Congress
AP Congress
Rajya Sabha Elections
Revanth Reddy
YS Sharmila
DCC Presidents Training
Telangana Politics
AP Politics
Political Affairs Committee

More Telugu News