Asaduddin Owaisi: ఇజ్రాయెల్, పాకిస్థాన్ పక్క దేశాలను బతకనివ్వవు... ఖమేనీ హత్య అన్యాయం: ఒవైసీ ఆక్రోశం

Asaduddin Owaisi Condemns Khamenei Assassination Calls it Unjust
  • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య అనైతికం మరియు చట్టవిరుద్ధమన్న ఒవైసీ
  • ఇజ్రాయెల్.. ఇరాన్ పై, పాకిస్థాన్ ... ఆఫ్ఘనిస్థాన్ పై దాడులు చేస్తున్నాయని ఆగ్రహం
  • ఇరాన్‌పై దాడుల్లో 200 మందికి పైగా మృతి.. వీరిలో 108 మంది విద్యార్థినులేనని ఆవేదన
  • గల్ఫ్‌లోని భారతీయుల రక్షణ కోసం కేంద్రం చొరవ చూపాలని డిమాండ్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది పూర్తిగా అనైతికమని, చట్టవిరుద్ధమైన చర్య అని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంయుక్తంగా ఇరాన్‌పై దాడులకు దిగడాన్ని ఆయన తప్పుబట్టారు. ఖమేనీని తమ నాయకుడిగా భావించే షియా ముస్లింలకు ఆయన తన పార్టీ తరఫున సానుభూతి తెలిపారు.

జెనీవాలో ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడులు జరగడం దురదృష్టకరమని ఒవైసీ అన్నారు. "చర్చలు సఫలమైతే అణ్వాయుధాల విషయంలో ఇరాన్ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేది. కానీ, పవిత్ర రంజాన్ మాసం అని కూడా చూడకుండా ట్రంప్, నెతన్యాహు దాడులకు తెగబడ్డారు. నెతన్యాహుకు అసలు మానవత్వమే లేదు" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై జరిగిన దాడుల్లో 200 మందికి పైగా చనిపోయారని, ముఖ్యంగా ఒక బాలికల పాఠశాల ధ్వంసమై 108 మంది విద్యార్థినులు ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందన్నారు.

ఇజ్రాయెల్ తీరును పాకిస్థాన్‌తో పోల్చిన అసదుద్దీన్.. ఈ రెండు దేశాలు ఆక్రమణదారులని, తమ పొరుగు దేశాలను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని విమర్శించారు. ఇజ్రాయెల్ ఇరాన్‌పై, పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్‌పై చేస్తున్న దాడులే ఇందుకు నిదర్శనమని అన్నారు. నెతన్యాహు పాలనలో పాలస్తీనాలో 70 వేల మంది ఊచకోతకు గురయ్యారని ధ్వజమెత్తారు. ట్రంప్, నెతన్యాహు భావిస్తున్నట్లు ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు జరగదని ఆయన స్పష్టం చేశారు.

యుద్ధాన్ని ఆపడానికి భారత్ తన వంతు పాత్ర పోషించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. "గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఒమన్ పోర్టులో జరిగిన దాడిలో ఇప్పటికే కొందరు భారత కార్మికులు గాయపడినట్లు సమాచారం ఉంది. ఉమ్రా కోసం వెళ్లిన వారు విమానాలు రద్దై, డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఖమేనీ హత్యను ఖండించి, ఈ యుద్ధాన్ని ఆపడానికి కృషి చేయాలి" అని ఆయన విజ్ఞప్తి చేశారు. యుద్ధం ఆగకపోతే ఆ ప్రాంతమంతా అస్థిరత నెలకొంటుందని హెచ్చరించారు.
Asaduddin Owaisi
Khamenei assassination
Iran attack
Israel Palestine conflict
Benjamin Netanyahu
Donald Trump
Pakistan Afghanistan
India Gulf relations
Shia Muslims
Iran nuclear deal

More Telugu News