బస్తీల బాట పట్టిన కిషన్ రెడ్డి
- బౌద్ధనగర్, సీతాఫల్మండి, మెట్టుగూడ డివిజన్లలో పర్యటించిన కిషన్ రెడ్డి
- బస్తీ వాసుల కష్టాలను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి
- మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వద్దని అధికారులకు ఆదేశం
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్, సీతాఫల్మండి, మెట్టుగూడ డివిజన్లలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పర్యటించారు. గల్లీ గల్లీ తిరుగుతూ బస్తీ వాసుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన, మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ... జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. బీజేపీని రాజకీయంగా దెబ్బతీసి, నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించేందుకే ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల సమస్యలను గాలికొదిలేశాయని విమర్శించారు.
నగరంలో తాగునీటి ఎద్దడి ప్రారంభమైందని, వర్షపు నీటి కాలువల్లో పూడిక తీయకుండానే కాంట్రాక్టర్లు బిల్లులు డ్రా చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దని, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ సమస్యలపై వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పాలకవర్గం రద్దయిన నేపథ్యంలో, తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.