విజయ్-రష్మిక పెళ్లి పోస్టుల రికార్డ్.. వ్యూస్‌తో సోషల్ మీడియా షేక్

  • రాజస్థాన్‌లో ఘనంగా జరిగిన విజయ్-రష్మిక వివాహం
  • సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫొటోలు పంచుకున్న నవ దంపతులు
  • నా బెస్ట్ ఫ్రెండ్‌ను భార్యగా చేసుకున్నా అంటూ విజయ్ భావోద్వేగ పోస్ట్
  • వివాహ ప్రకటనతో సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్
  • మార్చి 4న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా రిసెప్షన్
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ప్రేమ ప్రయాణానికి శుభం కార్డు వేస్తూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొంతకాలంగా కొనసాగుతున్న వారి ప్రేమాయణానికి ముగింపు పలుకుతూ, నిన్న ఉదయం 10 గంటల 10 నిమిషాలకు మూడు ముళ్ల బంధంతో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం హిందూ సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది.

పెళ్లి జరిగిన కొద్ది గంటలకే ఈ నూతన దంపతులు తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వివాహ వేడుకకు సంబంధించిన అందమైన ఫొటోలను షేర్ చేస్తూ, తమ ప్రేమను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. "హాయ్ మై లవ్స్.. నా భర్త విజయ్ దేవరకొండని పరిచయం చేస్తున్నాను" అంటూ ప్రారంభించి, తన జీవితంలో విజయ్ ఎంత ప్రత్యేకమో వివరించారు. నిజమైన ప్రేమ అంటే ఏమిటో చూపించాడని, తనలోని పాజిటివిటీని వెలికితీశాడని, పెద్ద కలలు కనేలా ప్రోత్సహించాడని ప్రశంసించారు. "నేను ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను" అంటూ విజయ్‌పై తనకున్న ప్రేమను చాటుకున్నారు.

మరోవైపు విజయ్ దేవరకొండ కూడా తన ప్రేమను వ్యక్తపరుస్తూ హృద్యమైన సందేశాన్ని పంచుకున్నారు. "ఒక రోజు ఆమెను చాలా మిస్ అయ్యాను. ఆమె ఉంటే నా రోజు ఇంకా బాగుండేదని అనిపించింది. ఆమెతో ఉంటే ఎక్కడైనా ఇంటి అనుభూతి కలుగుతుందని భావించాను. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్‌ను నా భార్యగా చేసుకున్నాను. 26.02.2026" అంటూ రష్మికతో తన బంధాన్ని అందంగా వర్ణించారు.

ఈ జంట పెళ్లి పోస్టులు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. విజయ్ పోస్ట్‌కు కొద్ది గంటల్లోనే 13 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా, రష్మిక పోస్ట్‌కు 15 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మొత్తంగా వీరి పోస్టులకు 28 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. భారతీయ సెలబ్రిటీల వివాహ ప్రకటనల చరిత్రలో ఇదొక సరికొత్త రికార్డుగా చెబుతున్నారు. ఇక వీరి వివాహ రిసెప్షన్‌ను మార్చి 4న హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నూతన దంపతులు కలిసి 'రణబాలి' అనే పీరియడ్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. 


More Telugu News