మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన వెంటనే... ఇరాన్ పై అమెరికా దాడి చేస్తుంది: ఒవైసీ

  • రెండు రోజుల ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న మోదీ
  • మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై ఒవైసీ విమర్శలు
  • మోదీ పర్యటన అనంతరం అంతర్జాతీయంగా పెను మార్పులు సంభవిస్తాయని వ్యాఖ్య

భారత విదేశాంగ విధాన చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అక్కడ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లిందనడంలో సందేహం లేదు. అయితే, ఈ చారిత్రాత్మక పర్యటనపై స్వదేశంలో రాజకీయ వేడి రాజుకుంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని పర్యటన తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


ప్రధాని మోదీ పర్యటన ముగిసిన వెంటనే అంతర్జాతీయంగా పెను మార్పులు సంభవించే అవకాశం ఉందంటూ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్ పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యంగా గాజాలో జరుగుతున్న మారణహోమానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రధాన కారకుడని... అటువంటి వ్యక్తిని ప్రధాని మోదీ కౌగిలించుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ పర్యటన భారతదేశానికి పాలస్తీనా పట్ల ఉన్న దశాబ్దాల మద్దతును దెబ్బతీసేలా ఉందని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో భారత్ అనుసరించిన తటస్థ మద్దతు వైఖరిని ప్రధాని పక్కన పెడుతున్నారని ఆయన విమర్శించారు.  



More Telugu News