లివ్-ఇన్ రిలేషన్‌లో ఘోరం: యువతి ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పుపెట్టిన ప్రియుడు!

  • పెళ్లి ప్రస్తావన తెచ్చిన యువతిపై ప్రియుడి దాడి
  • శానిటైజర్ పోసి నిప్పంటించి చిత్రహింసలు
  • మూడు రోజుల తర్వాత తల్లికి ఫోన్‌తో వెలుగులోకి ఘటన
  • విషమంగా యువతి పరిస్థితి.. నిందితుడు అరెస్ట్
గురుగ్రామ్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో దగ్గరై సహజీవనం చేస్తున్న యువతిపై ఓ యువకుడు అమానుషంగా దాడి చేశాడు. పెళ్లి చేసుకోవాలని కోరినందుకు ఆగ్రహంతో ఆమె ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించి, మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు.

త్రిపురకు చెందిన 19 ఏళ్ల యువతి గురుగ్రామ్‌లో బయోటెక్నాలజీ చదువుతోంది. ఆమెకు గతేడాది సెప్టెంబర్‌లో ఓ డేటింగ్ యాప్ ద్వారా ఢిల్లీకి చెందిన శివం (19) పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి, ఇద్దరూ కలిసి సెక్టార్ 69లోని ఓ ఫ్లాట్‌లో సహజీవనం చేస్తున్నారు. ఫిబ్రవరి 19న పెళ్లి విషయంపై వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన శివం ఆమెను గదిలో బంధించి, మెటల్ బాటిల్‌తో తలపై కొట్టి, ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు. అంతటితో ఆగకుండా కత్తితో కూడా దాడి చేశాడు.

మూడు రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఆ యువతి, చివరకు ధైర్యం చేసి తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఈ ఘోరం బయటపడింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని గురుగ్రామ్ ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు శివంను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. నిందితుడిపై హత్యాయత్నం, అత్యాచారం, అక్రమ నిర్బంధం వంటి కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామని, మెడికల్ రిపోర్టులు వచ్చిన తర్వాత మరిన్ని సెక్షన్లు చేర్చే అవకాశం ఉందని గురుగ్రామ్ డీసీపీ తెలిపారు.


More Telugu News