Chandru Lamani: కర్ణాటకలో రూ.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే

Chandru Lamani BJP MLA Arrested Taking Bribe in Karnataka
  • రహదారి పక్కన గోడ నిర్మించడంతో కాంట్రాక్టర్ నుంచి రూ.11 లక్షలు డిమాండ్
  • తన ఆసుపత్రిలోనే ఎమ్మెల్యే రూ.5 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న లోకాయుక్త
  • ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు సహాయకులను అరెస్టు చేసినట్లు తెలిపిన లోకాయుక్త
కర్ణాటకలో కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఒక బీజేపీ ఎమ్మెల్యేను పట్టుకున్నారు. గదగ జిల్లా శిరహట్టి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమాణి లంచం తీసుకుంటూ లోకాయుక్తకు చిక్కారు. రహదారి పక్కన గోడ నిర్మించిన విజయ్ పూజార్ అనే కాంట్రాక్టర్ నుంచి ఎమ్మెల్యే రూ.11 లక్షలు డిమాండ్ చేశారు.

దీంతో విజయ్ పూజార్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. లక్ష్మేశ్వరపురలోని తన ఆసుపత్రిలోనే ఎమ్మెల్యే రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎమ్మెల్యేతో పాటు అతడి ఇద్దరు సహాయకులు మంజునాథ్ వాల్మీకి, గురునాయక్‌లను అరెస్టు చేశారు.

మైనర్ ఇరిగేషన్ శాఖ కింద ఉన్న రోడ్డులో గోడ నిర్మించడంతో, దీనికి క్లియరెన్స్ ఇవ్వడానికి ఎమ్మెల్యే కాంట్రాక్టర్ నుంచి రూ.11 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు లోకాయుక్త తెలిపింది. దార్వాడ లోకాయుక్త ఎస్పీ సిద్ధలింగప్ప నేతృత్వంలో అధికారులు, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు.

నగదు డిమాండ్ చేస్తూ విజయ్‌కు చేసిన ఫోన్ కాల్ ఆడియో ఆధారంగా ఎమ్మెల్యేపై నిఘా పెట్టారు. అవినీతి నిరోధక చట్టం, 1988 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని అసెంబ్లీ స్పీకర్‌కు ఇచ్చారు.

ఈ అరెస్టుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. లంచం తీసుకుంటుండగా ఎమ్మెల్యే లమానీని లోకాయుక్త పట్టుకుందని అన్నారు. బీజేపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇతరులపై అవినీతి, లంచం ఆరోపణలు చేయడం సులభమని కానీ ఇప్పుడు వారి ఎమ్మెల్యేనే పట్టుబడ్డారని అన్నారు.
Chandru Lamani
Karnataka
BJP MLA
bribe
corruption
Lokayukta
Vijay Pujar
Siddaramaiah
arrest

More Telugu News