కామారెడ్డిలో ఇక సినిమా చూపిస్తాం: కాటిపల్లి వెంకటరమణారెడ్డి హెచ్చరిక

  • రేవంత్ రెడ్డి చెబుతున్న ప్రజాపాలన ఇదేనా అని నిలదీత
  • కామారెడ్డిలో ఈరోజు చూసింది ట్రైలర్ మాత్రమే అన్న ఎమ్మెల్యే
  • తమ కార్యకర్తలను సంయమనం పాటించాలని కోరానన్న ఎమ్మెల్యే
రేపటి నుంచి ఇక నుంచి యుద్ధ వాతావరణమేనని, వదిలిపెట్టే ప్రసక్తి లేదని కామారెడ్డి బీజేపీ శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి హెచ్చరిక జారీ చేశారు. కామారెడ్డికి ఏ ఇన్‌ఛార్జ్ మంత్రి వచ్చినా తాము నిలదీస్తూనే ఉంటామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్న ప్రజాపాలన ఇదేనా అని నిలదీశారు. సీఎంకు సమాధానం చెప్పే పాలన ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందన్నారు.

ఇష్టారీతిన మాట్లాడితే ఈరోజు ఏం జరిగిందో చూశారని అన్నారు. కామారెడ్డిలో ఈరోజు జరిగింది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు మర్యాదగా ప్రవర్తిస్తే మేం మర్యాదగా ఉంటామని లేదంటే మేం అలాగే స్పందిస్తామని స్పష్టం చేశారు.

కామారెడ్డిలో ఉదయం ఘర్షణ వాతావరణం ఉన్న సమయంలో తమ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరానని, ఎవరూ ఇక్కడకు రావొద్దని సూచించానని వెల్లడించారు. అదే తాను పిలిస్తే వేల మంది వచ్చేవారని, అప్పుడు పరిస్థితి ఉద్రిక్తంగా మారేదని తెలిపారు. అవినీతి ఆరోపణలపై నిరూపించాలని తాను సవాల్ చేశానని అన్నారు. నేను తప్పు చేస్తే తనను కాంగ్రెస్ నాయకులు చెప్పుతో కొట్టవచ్చని, కానీ తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే వారికి ఏ శిక్ష విధించాలో వారే చెప్పాలని అన్నారు.

అవినీతి ఆరోపణలు నిరూపించడానికి తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకుడు, తాను, అధికారులు మాత్రమే రావాలని చెప్పానని, కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు తరలి వచ్చారని ప్రశ్నించారు. వేలాదిమంది తరలి వచ్చి ఏం చేయాలనుకున్నారని ప్రశ్నించారు.


More Telugu News