పశ్చిమ బెంగాల్‌లో విద్యార్థుల పైకి తుపాకీతో కాల్పులు జరిపిన ఉపాధ్యాయుడు

  • తన ఇంటి పక్కన ఖాళీ స్థలంలో విద్యార్థులు ఆడుకుంటుండగా ఘటన
  • బంతి పలుమార్లు ఇంటి గోడను, తలుపును తాకడంతో ఆగ్రహం చెందిన ఉపాధ్యాయుడు
  • ఇంటి పైకి వెళ్లి విద్యార్థుల పైకి కాల్పులు
పశ్చిమ బెంగాల్‌లో ఒక ఉపాధ్యాయుడు కాల్పులు జరిపిన ఘటనలో ఒక విద్యార్థికి గాయాలయ్యాయి. కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ముర్షిదాబాద్ జిల్లాలో తన ఇంటి బయట ఆడుకుంటున్న స్కూల్ విద్యార్థులపై ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కాల్పులు జరపడం కలకలం రేపింది.

బనిపూర్ గ్రామంలో సమీర్ అనే ఉపాధ్యాయుడి ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం పది పన్నెండు మంది విద్యార్థులు రోజులాగే ఆ ఖాళీ స్థలంలో క్రికెట్, ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. విద్యార్థులు ఆడుకుంటుండగా బంతి సమీర్ ఇంటి తలుపుకు, గోడలకు పలుమార్లు తాకింది. దీంతో ఆగ్రహం చెందిన సమీర్ తన తుపాకీతో మైదానంలో ఆడుతున్న పిల్లల పైకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక విద్యార్థికి గాయాలయ్యాయి

తాము మైదానంలో ఆడుకుంటున్న సమయంలో బంతి సమీర్ ఇంటి గోడను తాకిందని, దీంతో ఆగ్రహం చెందిన ఉపాధ్యాయుడు తమ పైకి కాల్పులు జరిపాడని ఓ విద్యార్థి మీడియా ప్రతినిధులతో చెప్పాడు. తన ఇంటి పై అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కాల్పులు జరిపాడని చెప్పాడు. ఒక బుల్లెట్ తన స్నేహితులలో ఒకరికి తగిలిందని చెప్పాడు. స్థానికులు విద్యార్థిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించాడు.

విషయం తెలియగానే రఘునాథ్ గంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఒమర్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు తెలిపారు.


More Telugu News