CCPA: ఆరు ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రం నోటీసులు... కారణం ఇదే!

CCPA Issues Notices to Six E Commerce Firms for Illegal Sales
  • డ్రోన్ జామర్లు, జీపీఎస్ జామర్ల అమ్మకంపై కేంద్రం సీరియస్
  • నోటీసులు అందుకున్న వాటిలో ఇండియామార్ట్, ఎక్స్‌బూమ్ వంటి సంస్థలు
  • కొనుగోలుదారుల వివరాలతో సహా పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశం
  • ఈ పరికరాల అమ్మకం చట్టవిరుద్ధమని స్పష్టం చేసిన ప్రభుత్వం
దేశంలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ జామర్లు, ఇతర వైర్‌లెస్ పరికరాలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న ఆరు ఈ-కామర్స్ సంస్థలకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా డ్రోన్ జామర్లు, జీపీఎస్ జామర్లు, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్ వంటి నిషేధిత పరికరాలను విక్రయించడంపై సీసీపీఏ తీవ్రంగా స్పందించింది.

నోటీసులు అందుకున్న సంస్థలలో ఎవర్‌సే, ఇండియామార్ట్, ఎక్స్‌బూమ్, జావియట్ ఏరోస్పేస్, ఎయిర్‌వన్ రోబోటిక్స్, మావెరిక్ డ్రోన్స్ & టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ సంస్థలు వినియోగదారుల పరిరక్షణ చట్టం-2019తో పాటు, టెలికాం, వాణిజ్య నియంత్రణ చట్టాలను ఉల్లంఘించినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్-1885, వైర్‌లెస్ టెలిగ్రఫీ యాక్ట్-1933 ప్రకారం డ్రోన్ జామర్లు, సిగ్నల్ జామింగ్ పరికరాల అమ్మకాలపై కఠినమైన నియంత్రణలు ఉన్నాయి. టెలికాం విభాగం, వైర్‌లెస్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ నుంచి తప్పనిసరిగా లైసెన్సులు పొందాల్సి ఉంటుంది. కేవలం ప్రభుత్వ ఏజెన్సీలు, శాంతిభద్రతల పరిరక్షణ సంస్థలకు మాత్రమే వీటిని కొనుగోలు చేసే అధికారం ఉంటుంది.

ఈ నేపథ్యంలో, గత రెండేళ్లలో ఎన్ని యూనిట్లు విక్రయించారు, వాటిని ఎక్కడ నుంచి సేకరించారు, దిగుమతి లైసెన్సులు, కొనుగోలుదారుల పూర్తి వివరాలు సమర్పించాలని సీసీపీఏ ఆ సంస్థలను ఆదేశించింది. ఈ-కామర్స్ నిబంధనల ప్రకారం, తమ ప్లాట్‌ఫామ్‌లపై చట్టవిరుద్ధమైన వస్తువుల అమ్మకాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థలదేనని, దీన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కేంద్రం స్పష్టం చేసింది.
CCPA
E-commerce companies
Drone jammers
GPS jammers
Consumer Protection Act 2019
Indian Telegraph Act 1885
Wireless Telegraphy Act 1933
Online sales
Everse
IndiaMART

More Telugu News