చెత్తతో పాటు అనుకోకుండా బంగారం విక్రయం.. నిజాయతీ చూపిన స్క్రాప్ డీలర్

  • హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఘటన
  • స్క్రాప్ డీలర్‌కు చెత్తని విక్రయించిన అశోక్
  • పొరపాటున చెత్తతో పాటు రూ.15 లక్షల విలువైన బంగారం విక్రయం
  • అశోక్ బంగారాన్ని గుర్తించి అప్పగించిన స్క్రాప్ డీలర్
హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన స్క్రాప్ డీలర్ అనుకోకుండా తన వద్దకు వచ్చిన రూ.15 లక్షల విలువైన బంగారాన్ని తిరిగి అప్పగించి తన మంచి మనసును చాటుకున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా నగరానికి చెందిన అశోక్ తన ఇంటిని మొత్తం శుభ్రం చేసి చెత్తను స్థానిక స్క్రాప్ డీలర్ హాజీ అక్తర్‌కు విక్రయించాడు. అనుకోకుండా ఈ చెత్తలోనే 10 తులాల బంగారం వెళ్లింది. దీనిని అశోక్, స్క్రాప్ కొనుగోలుదారు ఎవరూ గుర్తించలేదు.

కొన్ని రోజుల తర్వాత ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో అశోక్ కుటుంబం స్క్రాప్ డీలర్‌ను సంప్రదించింది. వారు ఎంతగా వెతికినా బంగారం దొరకకపోవడంతో అశోక్ కుటుంబం నిరాశపడింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఇటీవల స్క్రాప్ డీలర్ చెత్తను వేరు చేస్తున్న సమయంలో స్క్రాప్ డీలర్ బంగారు ఆభరణాలను గుర్తించాడు. వెంటనే వాటిని స్థానిక పోలీసులకు అప్పగించాడు. అలాగే బంగారు ఆభరణాలను పోగొట్టుకున్న అశోక్ గురించి పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు అశోక్ కుటుంబాన్ని పిలిపించి ఆ బంగారు ఆభరణాలను అప్పగించారు.


More Telugu News