Ananta Babu: అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Ananta Babu Driver Murder Case Supreme Court Slams Police Investigation
  • పోలీసుల తీరుపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం
  • నిందితుడితో కుమ్మక్కు అయ్యారంటూ మండిపడ్డ సీజేఐ ధర్మాసనం
  • దర్యాప్తు చేతకాకపోతే సీబీఐకి ఇస్తామని వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో పోలీసులు ఈ కేసు విషయంలో వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్థలు, నిందితుడు ఒక్కటయ్యారు అనే రీతిలో వ్యవహరించారని మండిపడింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ.. నాటి దర్యాప్తులో పోలీసుల వైఖరిని ఎండగట్టింది. ‘‘నిందితుడితో పోలీసులు ఇప్పటికీ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇంత దారుణంగా వ్యవస్థలు నిర్వీర్యం అవుతుంటే డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారు?’’ అని ధర్మాసనం నిలదీసింది.

డిఫాల్ట్ బెయిల్ కుట్ర..
నాడు వైసీపీ ఎమ్మెల్సీకి బెయిల్ వచ్చేలా ఉద్దేశపూర్వకంగానే ఛార్జిషీట్ దాఖలు చేయడంలో జాప్యం చేశారని, నిందితుడితో పోలీసులు కుమ్మక్కు అయ్యారని ఇది స్పష్టం చేస్తోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మీకు దర్యాప్తు చేయడం చేతకాకపోతే చెప్పండి.. కేసును సీబీఐకి అప్పగిస్తాం’’ అని ఘాటుగా హెచ్చరించింది.

ప్రస్తుత ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం
గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వంపైనా కోర్టు ప్రశ్నలు సంధించింది. ‘‘నాడు తప్పు చేసిన పోలీసు అధికారులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? బాధ్యులైన వారిని ఎందుకు వదిలేశారు?’’ అని నిలదీసింది.

‘డెడ్‌లైన్’ ఆదేశాలు..
నవంబర్ 18 లోపు ట్రయల్ కోర్టు విచారణను పూర్తి చేయాలని, కేసు విచారణ కోసం మార్చి 31 లోగా హైకోర్టు ఒక సీనియర్ జ్యుడిషియల్ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని, జాప్యానికి తావులేకుండా రోజువారీ ప్రాతిపదికన విచారణ సాగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో హైకోర్టు జోక్యం చేసుకుని అడ్డంకులు సృష్టించవద్దని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Ananta Babu
Ananta Babu case
Subrahmanyam murder case
YSRCP MLC
Andhra Pradesh politics
Supreme Court
Police investigation
Default bail
CBI investigation
AP High Court

More Telugu News