చంద్రబాబు, కేసీఆర్‌ను మోసం చేసి రేవంత్ రెడ్డి పంచన చేరావు.. ఖబడ్దార్ కడియం శ్రీహరి: పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరిక

  • కేసీఆర్‌పై కడియం శ్రీహరి విమర్శలు చేయడంపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం
  • ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌లను మోసం చేసిన వ్యక్తి అని ఆరోపణ
  • ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఇచ్చి కేసీఆర్ రాజకీయ పునర్జీవం ప్రసాదించారన్న ఎమ్మెల్యే
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన విమర్శల పట్ల జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ పై కడియం శ్రీహరి చేసినవి దుర్మార్గపు వ్యాఖ్యలంటూ ఆయన తీవ్రంగా ఖండించారు. నాడు ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు, కేసీఆర్‌లను మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని ఆరోపించారు. ఈరోజు ఆయన రేవంత్ రెడ్డి పంచన చేరారని మండిపడ్డారు.

ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. కడియం శ్రీహరి అంటే మోసానికి పర్యాయపదమని, ఊసరవెల్లి సిగ్గుపడేలా... నమ్ముకున్న వారిని అందరినీ మోసం చేస్తూ వస్తున్న వ్యక్తి అని ఆరోపించారు. కడియం శ్రీహరికి టిక్కెట్ ఇచ్చి ఎంపీని, ఎమ్మెల్సీని, మంత్రిని చేసిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఆయనకు అన్ని రకాలుగా పదవులు ఇచ్చి కేసీఆర్ రాజకీయ పునర్జీవం ప్రసాదించారని పేర్కొన్నారు.

కడియం శ్రీహరి బిడ్డకు కూడా ఎంపీ టిక్కెట్ ఇచ్చారని గుర్తు చేశారు. మొన్నటి వరకు కేసీఆర్‌ను పట్టుకుని ఊరేగిన నాయకుడు ఈరోజు కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి వంటి నీచమైన, నికృష్టమైన రాజకీయ నాయకుడు ఈ భూమ్మీద లేడని అన్నారు. కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడే కడియం శ్రీహరి రాజకీయ వ్యభిచారి అని, ఆయన రాజకీయ జీవితానికి ప్రజలు త్వరలో చరమగీతం పాడతారని హెచ్చరించారు.


More Telugu News