Kadiyam Srihari: సెంటిమెంట్‌ను వాడుకుని ఇంకా ఎన్నిరోజులు రాజకీయం చేస్తారు.. సిగ్గుండాలి: కేసీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్య

తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుని ఇంకా ఎన్ని రోజులు రాజకీయం చేస్తారని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశానికి జాతిపిత ఒకరేనని, అది మహాత్మాగాంధీ అని అన్నారు.

తెలంగాణ ఎవరి జాగీరు కాదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ జాతిపిత ఎలా అయ్యారని ప్రశ్నించారు. జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాతిపిత అయితే ప్రజల్లోకి వచ్చి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

కేసీఆర్ తన హయాంలో అవకతవకలు, అక్రమాలు చేసి కుంభకోణాలలో ఇరుక్కున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే అది కూలిపోయిందని, రాష్ట్రాన్ని దివాలా తీయించారని అన్నారు. ప్రజలు అధికారం నుంచి దింపినా వారికి ఇంకా అహంకారం తగ్గలేదని విమర్శించారు.
Kadiyam Srihari
Kadiyam Srihari comments
KCR criticism
Telangana politics
BRS party
Station Ghanpur MLA

More Telugu News