బంగ్లా క్రికెట్‌లోకి షకీబ్, మష్రఫే రీ-ఎంట్రీ?.. కొత్త ప్రభుత్వ కీలక నిర్ణయం!

  • బంగ్లా క్రికెటర్లు షకీబ్, మష్రఫేల పునరాగమనానికి మార్గం సుగమం
  • వారిపై ఉన్న కేసుల పరిష్కారానికి కొత్త ప్రభుత్వం సానుకూలం
  • గత ప్రభుత్వంలో ఎంపీలుగా పనిచేసిన వైనం
  • ప్రస్తుతం కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు 
  • భారత్‌తో దెబ్బతిన్న క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయం
  • తిరిగి వచ్చి ఒక పూర్తి సిరీస్ ఆడి వీడ్కోలు పలకాలని షకీబ్ ఆకాంక్ష
బంగ్లాదేశ్ రాజకీయాల్లో మార్పు దేశ క్రికెట్‌పై కీలక ప్రభావం చూపనుంది. స్టార్ క్రికెటర్లు షకీబ్ అల్ హసన్, మష్రఫే మొర్తజాల విషయంలో కొత్తగా కొలువుదీరిన బీఎన్‌పీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. వారిపై ఉన్న కేసులను పరిష్కరించి, తిరిగి జాతీయ జట్టులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు క్రీడాశాఖ మంత్రి అమీనుల్ హక్ ప్రకటించారు.

షకీబ్, మష్రఫే కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదని, బంగ్లాదేశ్ క్రికెట్‌కు లెజెండ్స్ అని మంత్రి కొనియాడారు. వారిపై ఉన్న న్యాయపరమైన చిక్కులను త్వరగా పరిష్కరించి, మళ్లీ దేశం తరఫున ఆడేలా చూడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆగస్టు 2024 నుంచి దేశానికి దూరంగా ఉంటున్న షకీబ్‌ను తిరిగి బంగ్లా జెర్సీలో చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. గత అవామీ లీగ్ ప్రభుత్వంలో వీరిద్దరూ ఎంపీలుగా పనిచేసి, ప్రస్తుతం హత్య కేసులతో సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుతం భారత్‌తో బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. భద్రతా కారణాలతో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌లో జరగాల్సిన మ్యాచ్‌లను ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం భారత్‌తో క్రీడా సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే భారత డిప్యూటీ హైకమిషనర్‌తో చర్చలు జరిపినట్లు మంత్రి అమీనుల్ హక్ వెల్లడించారు.

మరోవైపు, తాను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించలేదని షకీబ్ అల్ హసన్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చి ఒక పూర్తిస్థాయి సిరీస్ ఆడిన తర్వాత గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నట్లు ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రభుత్వ సానుకూల వైఖరితో ఆయన పునరాగమనం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తారీఖ్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ 212 స్థానాల్లో గెలిచి ఘన విజయం సాధించింది. క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలనేది తమ ప్రభుత్వ విధానమని బీఎన్‌పీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)లో కూడా మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


More Telugu News