మదనపల్లి బాలిక హత్య నిందితుడు కులవర్ధన్ మృతదేహం చెరువులో లభ్యం
- మదనపల్లిలో ఏడేళ్ల బాలిక దారుణ హత్య
- కనసానిపల్లి చెరువులో కులవర్ధన్ మృతదేహం లభ్యం
- మృతదేహం నిందితుడిదేనని నిర్ధారించిన పోలీసులు
మదనపల్లిలో ఏడేళ్ల బాలిక నిన్న దారుణ హత్యకు గురవ్వడం సంచలనం రేపింది. ఇంటి పక్కనే ఉన్న కులవర్ధన్ అనే వ్యక్తి చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి, కిరాతకంగా హత్య చేసి డ్రమ్ములో కుక్కాడు. చిన్నారి హత్యతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దఎత్తున మహిళలు, ప్రజలు ఆందోళనకు దిగారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన మధ్య బాలిక మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బాలిక లైంగిక దాడికి కూడా గురైనట్లు పోస్టుమార్టం నివేదికలో బయటపడింది. ఈ ఘటన తర్వాత పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో చెరువులో నిందితుడు కులవర్ధన్ మృతదేహం లభ్యమయింది. మదనపల్లి సమీపంలోని ముదివేడు మండలం కనసానిపల్లి చెరువులో మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మదనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మృతదేహం మొత్తం ఉబ్బిపోయి ఉండటంతో దాదాపు 10 గంటల క్రితమే చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు పారిపోయే క్రమంలో చెరువులో పడి చనిపోయాడా? లేక ఇంకేదైనా జరిగిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. లభించిన మృతదేహం నిందితుడిదే అని అక్కడి ప్రజలు, పోలీసులు నిర్ధారించారు.