ఇబ్రహీంపట్నం ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు

  • ఛైర్మన్ ఎన్నికపై తుది నిర్ణయం ఆర్వోదేనని స్పష్టీకరణ
  • ఆకుల యాదగిరిపై ఒత్తిడి తీసుకు రావొద్దని కలెక్టర్, పోలీసులకు ఆదేశం
  • హైకోర్టు నిర్ణయంతో ఇబ్రహీంపట్నం ఛైర్మన్ ఎన్నికకు తొలగిన అడ్డంకి
ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు అడ్డంకి తొలగింది. ఛైర్‌పర్సన్ ఎన్నికకు సంబంధించి స్టేను తెలంగాణ హైకోర్టు ఎత్తివేసింది. ఛైర్మన్ ఎన్నికపై తుది నిర్ణయం రిటర్నింగ్ అధికారి (ఆర్వో)దేనని హైకోర్టు స్పష్టం చేసింది. 16వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన ఆకుల యాదగిరిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావొద్దని జిల్లా కలెక్టర్, పోలీసులను ఆదేశించింది.

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 16వ వార్డు నుంచి గెలిచిన తన తండ్రి యాదగిరి అదృశ్యమయ్యారంటూ కుమారుడు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు యాదగిరిని హైకోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఛైర్మన్ ఎన్నికలపై హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

తనను బలవంతంగా తీసుకెళ్లారు: యాదగిరి

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడగానే తనను బలవంతంగా చీరాలకు తీసుకువెళ్లారని యాదగిరి కోర్టుకు తెలిపారు. తనను రెండు రోజుల పాటు బలవంతంగా రిసార్టులో ఉంచారని అన్నారు. హైదరాబాద్‌లో 12 గంటల పాటు కారులో తిప్పారని కోర్టు దష్టికి తీసుకువెళ్లారు. హైకోర్టు ఉత్తర్వులతో తాను నిన్న కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యానని అన్నారు.


More Telugu News