కోహ్లీతో పాకిస్థాన్ క్రికెటర్‌ను పోల్చడంపై స్పందించిన దినేశ్ కార్తీక్

  • కోహ్లీతో బాబర్ ఆజామ్‌ను పోల్చడాన్ని తప్పుబట్టిన దినేశ్ కార్తీక్
  • జట్టును గెలిపిస్తాడన్న విశ్వాసం బాబర్‌లో కనిపించలేదన్న దినేశ్ కార్తీక్
  • కోహ్లీ నిర్లక్ష్యపు షాట్ల జోలికి వెళ్లడన్న దినేశ్ కార్తీక్
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజామ్ 7 బంతులు ఎదుర్కొని 5 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతడు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. చాలా కాలంగా, బాబర్‌ను విరాట్ కోహ్లీతో పోల్చుతున్నారు. ఈ పోలికను దినేశ్ కార్తీక్ తప్పుబట్టాడు. బాబర్ ఆజామ్ షాట్ సెలక్షన్ పేలవంగా ఉంటుందని అన్నాడు.

బాబర్ ఆజామ్‌ను విరాట్ కోహ్లీతో పోల్చుతున్నారని, ఇది ఏమాత్రం సరికాదని అన్నాడు. విరాట్ కోహ్లీ బాబర్ ఆజామ్‌లా నిర్లక్ష్యంగా షాట్‌లు ఆడటాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నాడు. జట్టును గెలిపిస్తాడన్న విశ్వాసం బాబర్‌లో కనిపించలేదని, అతడు పరుగులు కూడా చేయలేకపోయాడని గుర్తు చేశాడు. ఒత్తిడిలో పరుగులు చేయడమే గొప్ప క్రికెటర్ లక్షణమని, బాబర్ ఆజామ్‌లో అది కనిపించడం లేదని అన్నాడు.

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ నిర్లక్ష్యపు షాట్‌ల జోలికి వెళ్లడని అన్నాడు. ఈ సందర్భంగా 2022 ప్రపంచ కప్ ఇన్నింగ్స్‌ను దినేశ్ కార్తీక్ గుర్తు చేశాడు. మెల్‌బోర్న్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అత్యుత్తమ క్రికెటర్ అనిపించుకునే లక్షణాలు అతడిలో లేవని, నా వరకు అభిషేక్ శర్మ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ అన్నాడు.


More Telugu News