ఆ రెండు రైళ్లకు కుప్పంలో స్టాపేజ్... కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు

  • రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లకు కుప్పంలో స్టాపేజ్ మంజూరు చేశామన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ ద్వారా వెల్లడి
  • ఈ నెల 10న ఢిల్లీలో కలిసి కుప్పం మీదుగా నడిచే దూరప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపేజ్ కల్పించాలని విన్నవించిన సీఎం చంద్రబాబు 
రెండు ఎక్స్‌‌ప్రెస్ రైళ్లకు చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్‌లో స్టాపేజ్ మంజూరు చేస్తూ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లేఖ ద్వారా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలియజేశారు. 

వాస్కోడగామా -  వేలంకణి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై కుప్పం రైల్వే స్టేషన్‌లో నిలిచేలా అనుమతి ఇచ్చినట్లు మంత్రి స్పష్టం చేశారు. అలాగే దాదర్ సెంట్రల్  - పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలుకూ కుప్పంలో స్టాపేజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 

ఈ నెల 10న ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి కుప్పం రైల్వే స్టేషన్‌లో ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపేజ్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కుప్పం మీదుగా నడిచే దూరప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపేజ్ కల్పించాలని స్థానిక ప్రజల నుంచి పెద్దఎత్తున అభ్యర్థనలు వస్తున్నాయని గతంలోనే రైల్వే మంత్రికి సీఎం తెలియజేశారు. 

తాజాగా రెండు రైళ్ల స్టాపేజ్‌కు అధికారిక ఆమోదం లభించడంతో ఈ విషయాన్ని లేఖ రూపంలో రైల్వే మంత్రి సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. కుప్పంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు అంగీకారం తెలిపినందుకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
  


More Telugu News