మదనపల్లె ఘటన... బాలిక తల్లిదండ్రులను ఫోన్ లో పరామర్శించిన సీఎం చంద్రబాబు

  • మదనపల్లె బాలిక హత్యపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
  • నిందితుడిని వదిలిపెట్టేది లేదని కుటుంబానికి భరోసా
  • బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానం
  • నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్న హోం మంత్రి అనిత
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఆయన బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. మదనపల్లెలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఏడేళ్ల బాలిక, చివరకు శవమై తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, బాలిక మృతదేహాన్ని ఎదురింట్లో గుర్తించారు. ఆ ఇంట్లో నివసించే కులవర్ధన్ అనే వ్యక్తిపై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఈ ఘటన తెలియగానే స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు మదనపల్లె-కదిరి బైపాస్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా ఎస్పీ, సబ్ కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

హోం మంత్రి వంగలపూడి అనిత కూడా బాలిక కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, బెయిల్ రాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దల భరోసాతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించి, బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు అంగీకరించారు.


More Telugu News