Errabelli Dayakar Rao: రాజకీయాల్లో ఉండాలా, వద్దా అనేది అర్థం కావడం లేదు: ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీరు

తొర్రూరులో జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తీరును చూశాక రాజకీయాల్లో ఉండాలా, వద్దా అనేది అర్థం కావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరులో 16 వార్డులకు గాను 9 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఎక్స్అఫీషియో ఓట్లతో కలిపి రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. దీంతో లాటరీ తీయడంతో కాంగ్రెస్ రెండో వార్డు కౌన్సిలర్ శ్రావణ్ కుమార్ చైర్మన్ అయ్యారు.

ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తొర్రూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓ సమయంలో ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు, పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ మున్సిపాలిటీని దక్కించుకుంది.

తొర్రూరు మున్సిపాలిటీని కోల్పోవడంతో ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. రేయింబవళ్లు పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలని రోదిస్తూ అక్కడున్న పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల తీరు సరిగ్గా లేదని అన్నారు. ఇంత అరాచకంగా ఎన్నికలు నిర్వహించడమేమిటని ప్రశ్నించారు. కార్యకర్తలు తెగించి పోరాడారని అన్నారు. పోలీసులు రాజ్యాంగ విరుద్ధంగా పని చేశారని అసహనం వ్యక్తం చేశారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దగా, మోసం చూడలేదని కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నిక అప్రజాస్వామికంగా నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటివి చూస్తుంటే రాజకీయాల్లో ఉండాలో, వద్దో కూడా అర్థం కావడం లేదని అన్నారు. తొర్రూరు ప్రజలు తమకు పట్టం కడితే ఈ ప్రభుత్వం అన్యాయంగా మున్సిపాలిటీని దక్కించుకుందని అన్నారు. తనను, తన భార్యను అన్యాయంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొర్రూరులోని తన కార్యాలయానికి కూడా వెళ్లనీయడం లేదని ఆరోపించారు. విప్ జారీ చేయకుండా అన్యాయంగా అరెస్టు చేశారని అన్నారు.
Errabelli Dayakar Rao
Thorrur Municipality
Telangana Politics
BRS Party
Congress Party
Municipal Chairman Election

More Telugu News