Qiao: పాత సిమ్ కార్డుల నుంచి రూ.27 లక్షల బంగారం!

పనికిరానివని పడేసే పాత సిమ్ కార్డులు, ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) నుంచి ఓ వ్యక్తి ఏకంగా రూ. 27 లక్షల విలువైన బంగారం తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన కియావో అనే వ్యక్తి ఈ ఘనత సాధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, ప్రొఫెషనల్ స్క్రాప్ మెటల్ రీఫైనర్ అయిన కియావో, దాదాపు రెండు టన్నుల పాత టెలికాం చిప్‌లు, సిమ్ కార్డులు వంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించాడు. వీటి నుంచి క్లిష్టమైన రసాయన ప్రక్రియ ద్వారా సుమారు 191 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని వెలికితీశాడు. దీని విలువ దాదాపు 2 లక్షల యువాన్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 26 నుంచి 27 లక్షల వరకు ఉంటుందని అంచనా. జనవరి 20న తాను ఈ ప్రక్రియ చేస్తున్న వీడియోను పంచుకోగా, అది 5 మిలియన్లకు పైగా వీక్షణలు పొందింది.

ఈ-వేస్ట్‌ను రసాయనాల్లో ముంచి, వేడి చేసి, ఫిల్టర్ చేయడం ద్వారా బంగారాన్ని వేరు చేసినట్టు కియావో చూపించాడు. అయితే, ఇది చాలా ప్రమాదకరమైన ప్రక్రియ అని, ఇందులో వాడే రసాయనాల వల్ల ప్రాణాంతక వాయువులు వెలువడతాయని హెచ్చరించాడు. తన నైపుణ్యాన్ని ప్రదర్శించడానికే ఈ వీడియో పోస్ట్ చేశానని, సామాన్యులు ఎవరూ దీన్ని ప్రయత్నించవద్దని స్పష్టం చేశాడు.

చైనాలో ఇలా బంగారం శుద్ధి చేయడంపై కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అనుమతి లేనిదే దీన్ని చేస్తే భారీ జరిమానాలు, జైలు శిక్ష పడతాయి. అయితే, తనకు అధికారికంగా లైసెన్స్ ఉందని కియావో పేర్కొన్నాడు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, చైనాలో పాత సిమ్ కార్డులు, గోల్డ్-రిఫైనింగ్ కిట్‌లకు ఆన్‌లైన్‌లో డిమాండ్ అమాంతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Qiao
China
e-waste
gold recovery
sim cards
electronic waste
gold refining
Guangdong province
scrap metal

More Telugu News