India Cricket: పాకిస్థాన్‌ను మట్టికరిపించిన భారత్... వరల్డ్ కప్ సూపర్-8లోకి గ్రాండ్ ఎంట్రీ

India Defeats Pakistan Enters Super 8 T20 World Cup
  • టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం
  • 61 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించిన టీమిండియా
  • భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఇషాన్ కిషన్ (77)
  • వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్.. సూపర్-8లోకి ప్రవేశం
  • భారత బౌలర్ల ధాటికి 114 పరుగులకే కుప్పకూలిన పాకిస్థాన్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 61 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈరోజు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ విజయంతో గ్రూప్-ఏలో వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టింది. తద్వారా టోర్నమెంట్‌లో సూపర్-8 దశకు అధికారికంగా అర్హత సాధించింది.

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆది నుంచే తడబడింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు పాక్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే వికెట్లు తీసి పాక్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. ఒక దశలో 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఉస్మాన్ ఖాన్ (44) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అయితే, అతడు ఔటైన తర్వాత పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. హార్దిక్, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తిలక్ వర్మ (25), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32) నుంచి మంచి సహకారం లభించింది. అయితే, మిడిల్ ఓవర్లలో హార్దిక్ పాండ్య (0) విఫలమవడంతో స్కోరు వేగం తగ్గింది. చివర్లో శివమ్ దూబే (17 బంతుల్లో 27), రింకు సింగ్ (4 బంతుల్లో 11) వేగంగా ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ 3 వికెట్లు పడగొట్టాడు.

ఇక, భారత్ గ్రూప్-ఏలో తన చివరి లీగ్ మ్యాచ్ ను నెదర్లాండ్స్ తో ఈ నెల 18న అహ్మదాబాద్ లో ఆడనుంది. 



India Cricket
Pakistan Cricket
T20 World Cup
Hardik Pandya
Jasprit Bumrah
Ishan Kishan
Suryakumar Yadav
India vs Pakistan
Cricket World Cup
Super 8

More Telugu News