మరికొన్ని రోజుల్లో పెళ్లి... రౌడీ షీటర్‌తో వెళ్లిపోయిన లేడీ కానిస్టేబుల్!

  • ఉత్తరప్రదేశ్‌లో మీరట్ జిల్లాలో ఘటన 
  • రౌడీ షీటర్ అంకిత్ చౌహాన్ కిడ్నాప్ చేశాడంటూ మహిళా కానిస్టేబుల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు
  • తాను స్వచ్ఛందంగా అంకిత్ చౌహాన్‌తో వెళ్లిపోయానన్న మహిళా కానిస్టేబుల్
ఓ మహిళా కానిస్టేబుల్ పెళ్లికి ముందు రౌడీ షీటర్‌తో వెళ్లిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చర్చనీయాంశమైంది. మహిళా కానిస్టేబుల్ తన వివాహానికి ముందు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో పెళ్లి రద్దయింది. 

వివరాల్లోకి వెళితే.. బాసుమా ప్రాంతానికి చెందిన సంధ్యా భరద్వాజ్ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ముజఫర్‌నగర్‌కు చెందిన మరో కానిస్టేబుల్ అతుల్ శర్మతో వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబాలు ఆహ్వాన పత్రికలు పంపించి, పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశాయి. 

అయితే శనివారం సంధ్య కనిపించకుండా పోవడంతో ఆమె తండ్రి శుభాష్ శర్మ పలు ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురిని అంకిత్ చౌహాన్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని ఆరోపించారు. చౌహాన్ రౌడీ షీటర్ అని, ఫిబ్రవరి 5న వరుడు అతుల్ శర్మకు ఫోన్ చేసి బెదిరింపులు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంధ్యను పెళ్లి చేసుకుంటే ప్రాణాలు తీస్తానని హెచ్చరించినట్లు తెలిపారు. 

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి సంధ్యను బుక్సర్ జిల్లాలో గుర్తించారు. ఆమెను విచారించగా, ఎవరూ తనను కిడ్నాప్ చేయలేదని, తాను స్వచ్ఛందంగా అంకిత్ చౌహాన్‌తో వెళ్లినట్లు వెల్లడించింది. కాగా, చౌహాన్‌పై పలు కేసులు ఉన్నాయని, గతేడాది ఒక మద్యం దుకాణం దొంగతనం కేసులో అరెస్టై, ఇటీవలే బెయిల్‌పై విడుదలైనట్లు పోలీసులు తెలిపారు. సంధ్య స్వచ్ఛందంగా వెళ్లిపోయినట్లు వెల్లడించడంతో వరుడి కుటుంబం పెళ్లిని రద్దు చేసుకుంది.
 


More Telugu News