భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో రూ.40 కోట్ల విలువైన హెరాయిన్ జారవిడిచిన డ్రోన్

  • శుక్రవారం రాత్రి అనుమానిత డ్రోన్ కదలికలను గుర్తించిన స్థానికులు
  • డ్రోన్ ఏదో పదార్థాన్ని జారవిడిచినట్లు గుర్తించిన స్థానికులు
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఆర్ఎస్ పురా సెక్టార్‌ ప్రాంతంలో రూ.40 కోట్లకు పైగా విలువైన 6.5 కిలోల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్ వీటిని జారవిడిచినట్లు అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి అనుమానిత డ్రోన్ కదలికలను స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ డ్రోన్ ఏదో పదార్థాన్ని జారవిడిచినట్లు స్థానికులు వారికి తెలిపారు.

దీంతో పోలీసులు బీఎస్ఎఫ్ దళాలతో కలిసి ఆ ప్రాంతంలో తనిఖీలు చేశారు. స్థానిక పొలాల్లో పెద్ద ఎత్తున హెరాయిన్‌ను గుర్తించారు. దాని మొత్తం విలువ రూ.40 కోట్లకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు, కథువా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా పాక్ నుంచి హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని పంజాబ్‌‍లోని పఠాన్‌కోట్‌కు చెందిన జతిన్, కథువాలోని జఖ్‌బార్‌కు చెందిన డానిష్ డోగ్రాలుగా గుర్తించారు. వీరికి పాకిస్థాన్ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.


More Telugu News