పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం సాధిస్తుంది: మాజీ క్రికెటర్

  • పాక్ బౌలర్లను ఎదుర్కొనే సత్తా మన వారికి ఉందన్న హర్భజన్ 
  • నిత్యం ఆడుతున్నట్లే మనవాళ్లు పాకిస్థాన్‌తోనూ ఆడతారని ధీమా 
  • పాకిస్థాన్ మీదే ఒత్తిడి ఉంటుందన్న నయన్ మోంగియా
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధిస్తుందని టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. పాకిస్థాన్ బౌలర్లను ఎదుర్కొనే సత్తా మన వారికి ఉందని ధీమా వ్యక్తం చేశాడు. రాంచీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపు ఖాయమని వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను మనవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారని అన్నాడు.

రేపు పాకిస్థాన్‌తో ఆడబోయే మ్యాచ్ మన వారికి ప్రత్యేకమేమీ కాదని, వారు నిత్యం ఆడుతున్నట్లే ఆడుతారని అభిప్రాయపడ్డాడు. భారత్ జట్టు కూర్పు చాలా బాగుందని అన్నాడు. ఒత్తిడి లేకుండా మెరుగైన ప్రదర్శన చేసి విజయం సాధిస్తారని హర్భజన్ సింగ్ అన్నాడు.

ఈ మ్యాచ్ నేపథ్యంలో ఒత్తిడి అంతా పాకిస్థాన్ మీదనే ఉందని మరో మాజీ క్రికెటర్ నయన్ మోంగియా అన్నాడు. భారత బ్యాటింగ్, బౌలింగ్ చూసి మన వాళ్లు గెలుస్తారని ధైర్యంగా చెప్పవచ్చని తెలిపాడు. పాకిస్థాన్ జట్టు ఐసీసీ టోర్నమెంట్‌లలో వరుసగా ఏడెనిమిది మ్యాచ్‌లలో ఓడిపోయిందని గుర్తు చేశాడు. భారత్ మరోసారి పాకిస్థాన్‌ను ఓడించడం కష్టమేమీ కాదని అన్నాడు. భారత యువ క్రికెటర్లు ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతున్నారని అన్నాడు.


More Telugu News