టీ20 వరల్డ్ కప్: నమీబియాపై ఆరంభం అదిరినా.. చివర్లో తడబడ్డ భారత్!

  • టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్
  • ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా మెరుపు అర్ధశతకాలు
  • అద్భుత ఆరంభం లభించినా చివరి ఓవర్లలో వికెట్ల పతనం
  • ఆఖర్లో 4 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసిన భారత్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించినా, చివర్లో అనూహ్యంగా తడబడింది. బ్యాటర్ల మెరుపులతో భారీ స్కోరు ఖాయమనిపించినా, చివరి రెండు ఓవర్లలో వికెట్లు టపటపా కోల్పోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి, నమీబియా ముందు 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సులు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 86 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాత తిలక్ వర్మ (25), సూర్యకుమార్ యాదవ్ (12) త్వరగానే వెనుదిరిగినా, హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సులు) అద్భుత హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

ఒక దశలో 18.2 ఓవర్లకు 205/4 స్కోరుతో 220 పరుగులు సులభంగా దాటేలా కనిపించిన భారత్.. ఆ తర్వాత నాటకీయంగా కుప్పకూలింది. కేవలం 4 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయింది. నమీబియా కెప్టెన్, స్పిన్నర్ గెరార్డ్ ఎరాస్మస్ (4/20) అద్భుతంగా బౌలింగ్ చేసి భారత పతనాన్ని శాసించాడు. దీంతో టీమిండియా 209 పరుగులకే పరిమితమైంది.


More Telugu News