'ఏఐ' కంటెంట్ దుర్వినియోగంపై సోషల్ మీడియాకు కేంద్రం కీలక ఆదేశాలు

  • చట్టవిరుద్ధమైన అంశాలను నిరోధించడానికి ఆటోమేటెడ్ సాధనాలు ఉండాలన్న కేంద్రం
  • ఏఐ జనరేటెడ్ కంటెంట్‌కు లేబుల్ వేయాలని ఆదేశం
  • దుర్వినియోగం చేస్తే పడే పెనాల్టీలు, శిక్షల గురించి అవగాహన కల్పించాలన్న కేంద్రం
కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా రూపొందించే కంటెంట్‌ను గుర్తించడానికి, నియంత్రించడానికి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. చట్టవిరుద్ధమైన, అసభ్యకరమైన, తప్పుదారి పట్టించే విషయాలను నిరోధించడానికి ఆటోమేటెడ్ సాధనాలను అందుబాటులోకి తేవాలని సూచించింది.

కృత్రిమ మేధస్సుతో రూపొందించిన కంటెంట్ కొత్త సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ జనరేటెడ్ కంటెంట్‌కు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా లేబుల్ వేయాలని ఆదేశించింది. కంటెంట్‌ను అందరు సులువుగా గుర్తించేలా ఆ లేబుల్ ఉండాలని స్పష్టం చేసింది. ఒకసారి దీనిని అప్లై చేశాక లేబుల్‌ను గానీ మెటా డేటాను గానీ తొలగించడానికి లేదా కనబడకుండా చేయడానికి వీలులేకుండా ఉండాలని పేర్కొంది.

ఏఐ కంటెంట్‌ను దుర్వినియోగం చేస్తే పడే పెనాల్టీలు, శిక్షల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి యూజర్‌కు సందేశాలు పంపించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఏఐ జనరేటెడ్ లేదా డీప్ ఫేక్ కంటెంటును తొలగించాలని ప్రభుత్వం లేదా కోర్టులు ఆదేశించినప్పుడు దానిని మూడు గంటల్లోనే తొలగించాలని స్పష్టం చేసింది.


More Telugu News