ప్రధాని మోదీపై దాడికి ప్లాన్.. ఆ వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు

  • ఫిబ్రవరి 4 నాటి వీడియోను షేర్ చేసిన కిరణ్ రిజిజు
  • కాంగ్రెస్ మహిళా ఎంపీల ప్రవర్తనను చూసి ఆ పార్టీ నేతలు గర్వపడుతున్నారని ఎద్దేవా
  • ఆరోజు బీజేపీ ఎంపీలు సహనం వహించారన్న కిరణ్ రిజిజు
కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ కిరణ్ రిజిజు ఫిబ్రవరి 4న లోక్ సభ లోపల ప్రతిపక్ష ఎంపీలు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. లోక్ సభలో ప్రధాని మోదీని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్లాన్ చేసినట్లు ఇటీవల స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. విపక్షాల నిరసనల దృష్ట్యా ప్రధానిని సభకు రావొద్దని సూచించినట్లు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రిజిజు తన ఖాతాలో షేర్ చేశారు. ఫిబ్రవరి 4వ తేదీన పార్లమెంటులో కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఈవిధంగా చేసిన ఆందోళనను, వారి అవమానకరమైన ప్రవర్తనను చూసి ఆ పార్టీ నేతలు గర్వపడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఆ సమయంలో బీజేపీ ఎంపీలు ఎంతో సహనంతో ఉన్నారని తెలిపారు. బీజేపీ ఎంపీలు సహనం కోల్పోయి ఉంటే పరిస్థితి చేయిదాటిపోయేదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు గౌరవం, పవిత్రతను కాపాడేందుకు బీజేపీ ఎంపీలు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు.

కిరణ్ రిజిజు షేర్ చేసిన వీడియోలో కాంగ్రెస్ ఎంపీలు బ్యానర్ పట్టుకుని నినాదాలు చేస్తూ ప్రధానమంత్రి సీటు వద్ద ఆందోళన చేస్తున్నట్లుగా ఉంది. ఆందోళనను విరమించుకోవాలని కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, గిరిరాజ్ సింగ్‌లు కాంగ్రెస్ మహిళా ఎంపీలను కోరినప్పటికీ వారు అక్కడి నుంచి కదలడానికి నిరాకరిస్తున్నట్లు వీడియోలో ఉంది.


More Telugu News