వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న ఆరెస్సెస్ చీఫ్.. స్పందించిన కంగనా రనౌత్

  • సావర్కర్‌కు అత్యున్నత పురస్కారం లభించాలన్న కంగనా రనౌత్
  • దేశానికి ఆయన చేసిన సేవలు ఆ పురస్కారం కంటే గొప్పవని వ్యాఖ్య
  • మోహన్ భగవత్ వ్యక్తపరిచిన అభిప్రాయం ప్రతి భారతీయుడి మదిలో ఉందన్న కంగనా రనౌత్
వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సమర్థించారు. వీర్ సావర్కర్‌కు భారత అత్యున్నత పురస్కారం లభించాలని ఆమె అన్నారు. దేశానికి సావర్కర్ చేసిన సేవలు ఆ పురస్కారం కంటే గొప్పవేనని అన్నారు. పార్లమెంటు సమావేశాలకు హాజరైన ఆమె విలేకరులతో మాట్లాడారు.

సావర్కర్ విషయంలో మోహన్ భగవత్ వ్యక్తపరిచిన అభిప్రాయం ప్రతి భారతీయుడి మదిలో ఉందని ఆమె అన్నారు. సావర్కర్‌కు భారతరత్న లభిస్తే అది ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు.

బీజేపీ రాజస్థాన్ అధ్యక్షుడు మదన్ రాథోడ్ కూడా మోహన్ భగవత్ డిమాండుకు మద్దతు ఇచ్చారు. భారతదేశ స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం ఎన్నో కష్టాలను ఓర్చిన దేశభక్తుడు, విప్లవకారుడు సావర్కర్ అని అన్నారు. ఆయన కాలాపానీ జైల్లో ఎన్నో సంవత్సరాలు ఉన్నాడని గుర్తు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా పోరాటం చేశారని తెలిపారు. అలాంటి గొప్ప దేశభక్తుడికి భారతరత్న ఇవ్వాలని అన్నారు.

బీజేపీ ఎంపీ దినేశ్ శర్మ మాట్లాడుతూ, సావర్కర్ తన కంటే తన దేశాన్ని ఎక్కువగా ప్రేమించారని, భారతరత్నకు ఆయన అర్హుడని అన్నారు. సావర్కర్ తన జీవితమంతా కాలాపానీలో చిన్న జైలు గదిలో గడిపారని అన్నారు. సావర్కర్ నిజమైన జాతీయవాది, దేశభక్తి కలిగిన వ్యక్తి అన్నారు.

ముంబైలో జరిగిన ఆరెస్సెస్ శతాబ్ధి ఉత్సవాల కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొని, వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇస్తే దాని ప్రతిష్ఠ పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సావర్కర్‌కు ఏ ప్రాతిపదికన భారతరత్న ఇవ్వాలని ప్రశ్నించింది.


More Telugu News