: చదివింది పీజీ.. చేసింది ఐటీ జాబ్.. కానీ మారింది మాత్రం సీరియల్ దొంగగా!

  • విలాసవంతమైన జీవితం కోసం దొంగగా మారిన మాజీ ఐటీ ఉద్యోగి
  • వైజాగ్‌లో 27 ఏళ్ల అచ్చి మహేశ్‌ రెడ్డి అలియాస్ సన్నీ అరెస్ట్
  • నగరంలో 26 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదించిన పోలీసులు
  • రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి, బీఎండబ్ల్యూ కారు స్వాధీనం
  • నిందితుడికి 15 ఏళ్ల వయసు నుంచే నేర చరిత్ర ఉన్నట్టు వెల్లడి
విలాసవంతమైన జీవితం కోసం ఓ మాజీ ఐటీ నిపుణుడు దొంగగా మారిన ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది. బీఎండబ్ల్యూ కారు, విదేశీ పర్యటనలు వంటి ఖరీదైన అలవాట్ల కోసం వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అచ్చి మహేశ్‌ రెడ్డి అలియాస్ సన్నీ (27) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈ నేరాలకు పాల్పడ్డాడని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

విశాఖ నగరంలోని గాజువాక, అరిలోవ, మల్కాపురం, పెందుర్తి, దువ్వాడ పరిధిలో జరిగిన 26 ఇళ్ల దొంగతనం కేసులను ఈ అరెస్ట్‌తో పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో మొత్తం రూ. 24.66 లక్షల విలువైన సొత్తు అపహరణకు గురైనట్టు గుర్తించారు. ఇందులో 1,084 గ్రాముల బంగారం, 6,300 గ్రాముల వెండి, రూ. 40,500 నగదు ఉన్నాయి.

కాకినాడకు చెందిన సన్నీ, ప్రస్తుతం వైజాగ్‌లోని మాధవధారలో నివసిస్తున్నాడు. నిందితుడి నుంచి రూ. 15.63 లక్షల విలువైన 699 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.8 కిలోల వెండి వస్తువులు, దొంగిలించిన డబ్బుతో కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారు, ఓ స్కూటర్, దొంగతనానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖ భ్రత బాగ్చి వివరాల ప్రకారం సన్నీకి 15 ఏళ్ల వయసు నుంచే నేర చరిత్ర ఉంది. అప్పట్లో పీఎంపాలెం ప్రాంతంలో దొంగతనం చేస్తూ పట్టుబడగా జువైనల్ హోంకు పంపారు. విడుదలయ్యాక కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో మళ్లీ నేరాలకు పాల్పడి రాజమండ్రి సెంట్రల్ జైలులో 14 నెలల శిక్ష అనుభవించాడు. రాష్ట్రవ్యాప్తంగా ఇతనిపై 60కి పైగా దొంగతనం కేసులు ఉన్నట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. సుత్తి, స్క్రూడ్రైవర్లు వంటి పరికరాలతో ముసుగు ధరించి రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకునేవాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిపై సంబంధిత కేసులన్నీ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News