Bird Flu: చెన్నైలో 1,500 కాకులు మృతి... హై అలర్ట్

Bird Flu Outbreak in Chennai Kills 1500 Crows
  • చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం
  • మరణించిన కాకుల్లో ఏవియన్ ఇన్ ఫ్లుయెంజా ఉన్నట్లు నిర్ధారించిన ల్యాబ్
  • తమిళనాడు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం
  • చనిపోయిన పక్షులను తాకవద్దంటూ ప్రజలకు అధికారుల హెచ్చరిక
  • కేరళ, బీహార్‌లలోనూ బర్డ్ ఫ్లూ కేసులు నమోదు
చెన్నైలో 1,500కు పైగా కాకులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇది బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ ఫ్లుయెంజా) కారణంగానే అని నిర్ధారణ కావడంతో నగరాన్ని హై అలర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి, వ్యాధి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇటీవలి రోజుల్లో నగరంలోని అడయార్, గాంధీ నగర్, పల్లికరనై, వేలచ్చేరి, ఈస్ట్ కోస్ట్ రోడ్, ఓల్డ్ మహాబలిపురం రోడ్ వంటి పలు ప్రాంతాల్లో కాకులు పెద్ద సంఖ్యలో చనిపోయి కనిపించాయి. సమాచారం అందుకున్న కాంచీపురం యానిమల్ డిసీజ్ ఇన్వెస్టిగేషన్ బృందం గత నెలలో మరణించిన కాకుల నుంచి శాంపిళ్లను సేకరించి భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ డిసీజ్ కంట్రోల్‌కు పంపింది. పరీక్షల అనంతరం కాకుల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమని నివేదికలు స్పష్టం చేశాయి.

ఈ వైరస్ ఇతర జంతువులకు, అరుదుగా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉండటంతో కేంద్ర పశువైద్య పరిశోధన సంస్థ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. నిఘాను పెంచాలని, ప్రభావిత ప్రాంతాల్లో పక్షుల కదలికలపై ఆంక్షలు విధించాలని సూచించింది. పశుసంవర్ధక శాఖ కూడా ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. ఎక్కడైనా పక్షులు చనిపోయి కనిపిస్తే వెంటనే అధికారులకు తెలపాలని కోరింది. చనిపోయిన పక్షులను నేరుగా చేతులతో తాకవద్దని, వాటి కళేబరాలను కనీసం 8 అడుగుల లోతైన గొయ్యి తీసి పూడ్చివేయాలని హెచ్చరించింది.

ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, భద్రతా మార్గదర్శకాలను పాటిస్తే సరిపోతుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. చెన్నైలోని పౌల్ట్రీ ఫారాలు, పక్షులు నివసించే ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఇదిలా ఉండగా, కేరళ, బీహార్ రాష్ట్రాల్లోనూ బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.

More Telugu News

Bird Flu
Chennai
Tamil Nadu
avian influenza
crow deaths
poultry farms
animal disease
public health
Kerala
Bihar