Rahul Gandhi: 'మిత్ర ద్రోహి' కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తావ్ అన్న రాహుల్ గాంధీ.. మీరే దేశద్రోహులంటూ కేంద్రమంత్రి కౌంటర్

Rahul Gandhi calls Ravneet Singh Bittu traitor
షార్ట్స్‌లో చూడండి
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి, మాజీ కాంగ్రెస్ నేత రవ్‌నీత్ సింగ్ బిట్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ప్రాంగణంలో తనను 'దేశద్రోహి' అని సంబోధించిన రాహుల్, ఒక వీధి రౌడీలా ప్రవర్తించారని, తనపై భౌతిక దాడికి కూడా ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనతో పార్లమెంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

బుధవారం పార్లమెంట్ ప్రధాన ద్వారం నుంచి వెళ్తున్న సమయంలో సస్పెండైన ఎంపీలతో కలిసి ఉన్న రాహుల్ గాంధీ, తనను చూసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని రవ్‌నీత్ సింగ్ బిట్టు తెలిపారు. "అదిగో దేశద్రోహి వెళ్తున్నాడు. అతని ముఖం చూడండి" అంటూ రాహుల్ గట్టిగా అరిచారని చెప్పారు. అంతటితో ఆగకుండా, "హలో సోదరా, నా దేశద్రోహి మిత్రమా. కంగారు పడకు, నువ్వు మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తావులే" అని తనతో అన్నారని బిట్టు వివరించారు.

రాహుల్ వ్యాఖ్యలకు తాను తీవ్రంగా ప్రతిస్పందించానని బిట్టు తెలిపారు. "రాహుల్ ఇంకా ఏదో సంస్థానానికి యువరాజుననే అపోహలో ఉన్నట్టున్నారు. నేను ఆయనతో కరచాలనం చేస్తానని అనుకున్నారు. కానీ నేను, 'రాహుల్ జీ, మీరే ఈ దేశానికి శత్రువు. మీరు సైనికులకు వ్యతిరేకి, పార్లమెంటులో ఎప్పుడూ వారికి వ్యతిరేకంగానే మాట్లాడతారు' అని స్పష్టంగా చెప్పాను" అని బిట్టు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తనపై భౌతిక దాడికి యత్నించారని బిట్టు ఆరోపించారు. "నేను కరచాలనం చేసేందుకు నిరాకరించగానే, రాహుల్ నాపైకి దూసుకొచ్చారు. వెంటనే కేసీ వేణుగోపాల్ అడ్డుకుని ఆయన్ను వెనక్కి తీసుకెళ్లారు. వేణుగోపాల్ గనుక అడ్డుకోకపోయి ఉంటే, రాహుల్ నాపై దాడి చేసేవారే. ఒకవేళ దాడి చేసి ఉంటే, నేను కూడా ఊరుకునేవాడిని కాదు" అని బిట్టు హెచ్చరించారు. వీధి రౌడీలు కూడా చేయని పనిని రాహుల్ చేశారని ఆయన మండిపడ్డారు.

గాంధీ కుటుంబంపై, కాంగ్రెస్ పార్టీపై కూడా బిట్టు తీవ్ర విమర్శలు చేశారు. "సిక్కుల హంతకులైన గాంధీ కుటుంబ వారసుడితో ఒక సర్దార్ ఎప్పటికీ చేయి కలపడు. కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది సిక్కులను చంపింది. గురుద్వారాలను ధ్వంసం చేసింది. వారు ఎప్పటికీ మాకు శత్రువులే" అని అన్నారు. తన తాత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, అయితే ఆయన కీర్తిని చూసి గాంధీ కుటుంబం ఓర్వలేకపోయిందని ఆరోపించారు. పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాక గాంధీ కుటుంబ పాలన అంతమైందని, పరిస్థితులు మారాయని గుర్తుచేశారు.

ఒక పార్లమెంటేరియన్ అయి ఉండి ఇలాంటి పదజాలం వాడటం, దాడికి యత్నించడం రాహుల్ గాంధీకి తగదని బిట్టు హితవు పలికారు. "ప్రస్తుతం నేను ఉన్న బీజేపీలో ప్రధాని మోదీ, అమిత్ షా నాకు ఎంతో గౌరవం ఇస్తున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు తావులేదు. ఈ ఘటన పార్లమెంట్ ఆవరణలో జరగడం వల్లే అసలు విషయం అందరికీ తెలిసింది" అని రవ్‌నీత్ సింగ్ బిట్టు వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Rahul Gandhi
Ravneet Singh Bittu
Congress
BJP
Parliament
India
Sikh
Politics
Defection

More Telugu News