ఐటీ రంగంలో పెను ప్రకంపనలు: ఒరాకిల్‌లో ఒకేసారి 30,000 మందిపై వేటు?

  • ఏఐ కోసం భారీగా ఖర్చు, నిధుల కొరత
  • రుణాలు ఇచ్చేందుకు అమెరికా బ్యాంకుల వెనకడుగు
  • ఓపెన్ ఏఐ  ఒప్పందంతో అంతా తలకిందులు
  • ఉద్యోగుల తొలగింపు ద్వారా 10 బిలియన్ డాలర్ల ఆదా!
  • హైదరాబాద్, బెంగళూరులోని ఉద్యోగులపైనా వేటు?
ప్రపంచ టెక్ దిగ్గజం ఒరాకిల్ తన చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్స్‌కు సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల కోసం పెట్టిన భారీ ఖర్చులు, నిధుల కొరత వెరసి దాదాపు 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ భావిస్తోంది. ఈ మేరకు ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ టీడీ కోవెన్ తన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా ఎదగాలనే ఉద్దేశంతో ఒరాకిల్ భారీగా డేటా సెంటర్లను నిర్మిస్తోంది. ముఖ్యంగా శామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని ఓపన్ ఏఐ కోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దాదాపు 156 బిలియన్ డాలర్ల వ్యయం చేస్తోంది. అయితే, ఒరాకిల్ ఆర్థిక పరిస్థితిపై సందేహాలతో అమెరికా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనకాడుతున్నాయి. ఈ నిధుల కొరతను అధిగమించేందుకు, ఉద్యోగుల తొలగింపు ద్వారా 8 నుంచి 10 బిలియన్ డాలర్ల నగదును ఆదా చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

కేవలం ఉద్యోగులనే కాకుండా, కంపెనీ తన కస్టమర్లను కూడా ఇబ్బందులకు గురిచేస్తోంది. కొత్తగా వచ్చే కస్టమర్లు తమ ఫీజులో 40 శాతం ముందుగానే చెల్లించాలని షరతులు విధిస్తోంది. అంతేకాకుండా "మీ చిప్స్ మీరే తెచ్చుకోండి" అనే వింత విధానాన్ని కూడా పరిశీలిస్తోంది. నిధుల సమస్య కారణంగా డేటా సెంటర్ల నిర్మాణం ఆలస్యం కావడంతో ఓపెన్ ఏఐ వంటి సంస్థలు తమ క్లౌడ్ అవసరాల కోసం మైక్రోసాఫ్ట్, అమెజాన్ వైపు చూస్తున్నాయి.

ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా 2022లో 28 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ యూనిట్ 'సెర్నర్'ను కూడా విక్రయించే ఆలోచనలో ఒరాకిల్ ఉంది. ఇప్పటికే 2025 చివరిలో 10,000 మందిని తొలగించిన కంపెనీ, ఇప్పుడు మరో భారీ కోతకు సిద్ధమవడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఒరాకిల్ తన రుణాల కోసం ఇప్పుడు ఆసియా బ్యాంకుల వైపు చూస్తోంది. అయితే అమెరికా బ్యాంకుల కంటే ఇక్కడ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం కంపెనీకి భారంగా మారింది. మరోవైపు, ఈ లేఆఫ్స్ ప్రభావం ఇండియాలోని హైదరాబాద్, బెంగళూరు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులపై కూడా పడే అవకాశం ఉందని సమాచారం. ఈ వారంలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


More Telugu News