Pawan Kalyan: ప్రతిదానికీ నేనే స్పందిస్తుంటే మీరెందుకు ఉన్నట్టు?: జనసేన నేతలపై పవన్ కల్యాణ్ అసంతృప్తి!

Pawan Kalyan Displeased with Janasena Leaders Performance
షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమ పార్టీ నాయకుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి అంశంపైనా తానే స్పందించాల్సి వస్తుంటే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా మీరెందుకు ఉన్నట్టని మందలించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన జనసేన కార్యవర్గ సమావేశంలో ఆయన పార్టీ నాయకులకు కీలక దిశానిర్దేశం చేశారు.

ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎందుకు బలంగా తిప్పికొట్టడం లేదని పవన్ ప్రశ్నించారు. ఈ కల్తీ వెనుక వైసీపీ నేతలు, కొందరు అధికారుల పాత్ర ఉందని ఆధారాలతో సహా నిరూపించాలని సూచించారు. వైసీపీ నేతలు చేసే ప్రేరేపిత వ్యాఖ్యలకు, బెదిరింపులకు లొంగవద్దని హెచ్చరించారు.

"వైసీపీ నేతలు వేసే ఉచ్చులో పడొద్దు. మీపై, మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. మహిళల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి" అని పవన్ హితవు పలికారు. విమర్శలకు సిద్ధాంతపరంగా, విషయ పరిజ్ఞానంతోనే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదేవిధంగా, అధికార కూటమిపై సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయకుండా, కూటమి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

ఈ ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం గ్రామ స్థాయిలో ఐదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Tirupati Laddu
AP Politics
Andhra Pradesh
YSRCP
Local Body Elections
Political News
CK Convention

More Telugu News