Purandeswari: నిడదవోలులో 3 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపండి... కేంద్ర మంత్రికి పురందేశ్వరి విజ్ఞప్తి

Purandeswari Requests Halt for 3 Express Trains at Nidadavolu
షార్ట్స్‌లో చూడండి
ప్రయాణికుల సౌకర్యార్థం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు రైల్వే స్టేషన్‌లో మూడు ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నిలుపుదల (హాల్ట్) కల్పించాలని రాజమండ్రి ఎంపీ, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ఆమె ఒక వినతిపత్రం అందజేశారు.

విజయవాడ–విశాఖపట్నం, విజయవాడ–నర్సాపురం ప్రధాన మార్గాలను అనుసంధానించే కీలకమైన జంక్షన్‌గా నిడదవోలు ఉందని పురందేశ్వరి తన వినతిలో పేర్కొన్నారు. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ (18519/18520), జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805/12806), కోకనాడ ఎక్స్‌ప్రెస్ (12775/12776) రైళ్లకు ఇక్కడ హాల్ట్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

ముంబై వెళ్లే చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు, ఉద్యోగులతో పాటు ద్వారకా తిరుమల, విజయవాడ, మంగళగిరి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికులు ఈ రైళ్ల కోసం ఇతర స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోందని ఆమె తెలిపారు. సాధ్యత నివేదిక (ఫీజిబిలిటీ రిపోర్ట్) ప్రకారం, ఈ రైళ్లను నిడదవోలులో ఆపడానికి కేవలం 4 నుంచి 5 నిమిషాల అదనపు సమయం మాత్రమే పడుతుందని, దీనివల్ల ఇతర రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో రైల్వేకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుందని పురందేశ్వరి పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఈ రైళ్లకు నిడదవోలులో హాల్ట్ మంజూరు చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు.
Go Back to Shorts
Purandeswari
Nidadavolu
railway halt
express trains
Ashwini Vaishnaw
East Godavari
train stoppage
Andhra Pradesh
railway station
public transport

More Telugu News