Hyderabad: చర్లపల్లి విషాదం.. ఒంటరితనమే తల్లీబిడ్డల ప్రాణం తీసిందా?

Ghatkesar Railway Track Family Suicide Case Key Facts Come Out
  • హైదరాబాద్ శివార్లలో ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య
  • ఒంటరితనమే ఈ దారుణానికి కారణమని పోలీసుల ప్రాథమిక అంచనా
  • కారులో సూసైడ్ నోట్.. వాట్సప్‌లో స్టేటస్‌గా పెట్టిన విజయరెడ్డి
  • విజయరెడ్డి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • కుటుంబ, ఆస్తి గొడవల కోణంలోనూ కొనసాగుతున్న దర్యాప్తు
హైదరాబాద్ శివార్లలో జరిగిన తల్లీబిడ్డల ఆత్మహత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చర్లపల్లి-ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై ఐటీ ఉద్యోగిని విజయరెడ్డి తన ఇద్దరు పిల్లలు చేతన, విశాల్‌తో కలిసి బలవన్మరణానికి పాల్పడటం తెలిసిందే. ఈ దారుణానికి ఆమెలో పేరుకుపోయిన ఒంటరితనమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

వివరాల్లోకి వెళితే... ఉప్పల్ రాఘవేంద్రనగర్‌ కాలనీకి చెందిన విజయరెడ్డికి సురేందర్‌రెడ్డితో 2007లో వివాహమైంది. భర్త సురేందర్‌రెడ్డి నాలుగేళ్లుగా దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుండటంతో, విజయరెడ్డి తన తల్లితో కలిసి ఉంటున్నారు. నగరంలోని ఓ ఐటీ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్న ఆమె, నైట్ షిఫ్టుల కారణంగా పిల్లలిద్దర్నీ హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు. అయితే, భర్తకు దూరంగా ఉండటం, పిల్లలు కూడా అందుబాటులో లేకపోవడంతో గత 15 రోజులుగా ఆమె తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని స్నేహితులతో చెబుతూ ఆవేదన చెందేవారని తెలిసింది.

శనివారం తెల్లవారుజామున హాస్టల్ నుంచి పిల్లలను కారులో తీసుకెళ్లిన విజయరెడ్డి, చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద కారు పార్క్ చేశారు. అక్కడే పార్కింగ్ స్లిప్ వెనుక "నాకు బతకాలని లేదు. నేను లేకపోతే పిల్లలు అనాథలవుతారు. అందుకే నాతో పాటే తీసుకెళ్తున్నా" అని సూసైడ్ నోట్ రాశారు. ఆ నోట్‌ను ఫొటో తీసి తన వాట్సప్ స్టేటస్‌గా కూడా పెట్టుకున్నట్లు తెలిసింది. అనంతరం పిల్లలతో కలిసి గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

ఘటనా స్థలంలోని కారు నుంచి సూసైడ్ నోట్‌ను, విజయరెడ్డి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపనున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె ఎవరితో మాట్లాడారు, చాటింగ్ వివరాలపై ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలు లేదా ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
Hyderabad
Vijaya Reddy
Hyderabad Suicide
Suicide note
Charlapalli
IT Employee
Family Problems
Children
Railway Track Suicide
Telangana News

More Telugu News