హైదరాబాద్‌లో చిన్నారి ప్రాణాలు తీసిన చైనా మాంజా

  • కూకట్‌పల్లిలో మాంజా కారణంగా ఐదేళ్ల బాలిక మృతి
  • ఇద్దరు కుమార్తెలతో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఘటన
  • బాలిక మెడకు చుట్టుకుని కిందపడి అక్కడికక్కడే మృతి
చైనా మాంజా కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో ఐదేళ్ల బాలిక మాంజా కారణంగా ప్రాణాలు కోల్పోయింది. మేడ్చల్ జిల్లా ఖాజీపల్లి నుంచి తండ్రితో పాటు ఇద్దరు కుమార్తెలు ద్విచక్ర వాహనంపై కూకట్‌పల్లికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వివేకానందనగర్‌ హైవే వద్ద చైనా మాంజా బాలిక నిష్విక మెడకు చుట్టుకుంది. దాంతో ఆమె కిందపడిపోయింది. తీవ్ర గాయం కావడంతో బాలిక అక్కడకక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చైనా మాంజా సాధారణ నూలు దారం కాదు. ఇది నైలాన్ లేదా సింథటిక్ పదార్థంతో తయారవుతుంది. దానిపై గాజు ముక్కల పొడిని పూస్తారు. ఈ దారం పక్షుల రెక్కలను, మనుషుల నరాలను కోసేంత ప్రమాదకరంగా ఉంటుంది. ఇది తెగిపోయి ఎక్కడైనా చిక్కుకుంటే ప్రాణాంతకంగా మారుతుంది. తెలంగాణ ప్రభుత్వం చైనా మాంజా అమ్మకాలపై నిషేధం విధించినప్పటికీ, కొందరు రహస్యంగా విక్రయిస్తున్నారు.


More Telugu News