ఆదిలాబాద్ జిల్లాలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్

  • సాదా బైనామా రిజిస్ట్రేషన్ కోసం రూ. 2 లక్షలు డిమాండ్
  • రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు
  • లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు ఏసీబీ సూచన
ఆదిలాబాద్ జిల్లాలో ఓ రెవెన్యూ ఉద్యోగి లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. బజార్‌హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కటకం విద్యాసాగర్ రెడ్డి, ఓ రైతు నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, ఓ ఫిర్యాదుదారునికి చెందిన 8.35 ఎకరాల భూమికి సంబంధించిన సాదా బైనామా రిజిస్ట్రేషన్ దస్తావేజును ప్రాసెస్ చేసి పంపించడానికి విద్యాసాగర్ రెడ్డి ఈ మొత్తాన్ని డిమాండ్ చేశాడు. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారి సూచన మేరకు, పక్కా ప్రణాళికతో బాధితుడు డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి విద్యాసాగర్ రెడ్డిని పట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా, ఉద్యోగి అయినా లంచం అడిగితే వెంటనే తమ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

Katakm Vidyasagar Reddy
Adilabad
ACB
Telangana ACB
Bazarhatnur
Bribery Case
Tahsildar Office
Toll Free Number 1064
Land Registration
Corruption

More Telugu News