కూతురి పెళ్లికి 3 కిలోల వెండి పత్రిక.. రూ. 25 లక్షలతో తండ్రి అపురూప కానుక!

  • కూతురి పెళ్లి కోసం జైపూర్ వ్యక్తి ప్రత్యేక శుభలేఖ
  • 3 కిలోల స్వచ్ఛమైన వెండితో రూ. 25 లక్షల వ్యయంతో తయారీ
  • పత్రికపై 65 మంది దేవతల విగ్రహాల అద్భుత క‌ళారూపం
  • సంవత్సరం పాటు శ్రమించి తండ్రే స్వయంగా రూపకల్పన
  • బంధువులతో పాటు దేవతలను కూడా ఆహ్వానించడమే లక్ష్యమన్న తండ్రి
కూతురి పెళ్లిని చిరస్మరణీయం చేయాలని ఓ తండ్రి చూపిన ప్రేమ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జైపూర్‌కు చెందిన శివ్ జోహ్రి, తన కుమార్తె శ్రుతి జోహ్రి వివాహానికి ఏకంగా 3 కిలోల స్వచ్ఛమైన వెండితో ఓ అద్భుతమైన శుభలేఖను తయారు చేశారు. దీని విలువ సుమారు రూ. 25 లక్షలు. ఒక్క మేకు లేదా స్క్రూ కూడా వాడకుండా 128 వెండి ముక్కలతో ఈ పత్రికను రూపొందించడం విశేషం.

ఈ వెండి పత్రికపై 65 మంది దేవతామూర్తులను అత్యంత సుందరంగా చెక్కారు. పైన వినాయకుడి విగ్రహంతో పాటు "శ్రీ గణేశాయ నమః" అని రాసి ఉంది. గణేశుడికి కుడివైపు పార్వతీదేవి, ఎడమవైపు పరమశివుడు కొలువై ఉండగా, వారి కింద లక్ష్మీదేవి, విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి జీవిత ఘట్టాలు, విష్ణువు దశావతారాలు, అష్టలక్ష్మి స్వరూపాలు, సూర్యభగవానుడు, వేంకటేశ్వరస్వామి వంటి అనేక దైవ స్వరూపాలు ఈ పత్రికపై దర్శనమిస్తాయి.

ఈ పత్రికను తానే స్వయంగా ఏడాది పాటు శ్రమించి తయారు చేశానని తండ్రి శివ్ జోహ్రి తెలిపారు. "నా కుమార్తె పెళ్లికి బంధువులనే కాదు, దేవతలందరినీ కూడా ఆహ్వానించాలనుకున్నాను. నా బిడ్డకు తరతరాలు గుర్తుంచుకునేలా ఓ కానుక ఇవ్వాలన్నది నా కోరిక. ఆరు నెలల ఆలోచన తర్వాత ఈ ప్రత్యేకమైన శుభలేఖను తయారు చేయాలని నిర్ణయించుకుని, ఏడాది పాటు పనిచేశాను" అని ఆయన వివరించారు.

పత్రిక మధ్యలో వధూవరులు శ్రుతి జోహ్రి, హర్ష్ సోనీ పేర్లను చెక్కారు. వారి పేర్ల చుట్టూ ఏనుగులు పూల వర్షం కురిపిస్తున్నట్టుగా డిజైన్ చేశారు. లోపలి భాగంలో సంప్రదాయ పత్రికల మాదిరిగానే ఇరు కుటుంబాల సభ్యుల పేర్లను కూడా వెండిపైనే ముద్రించారు.


More Telugu News