ఒకరు ఉద్యోగం, మరొకరు వ్యాపారం చేయండి: ఎన్నార్టీలకు చంద్రబాబు పిలుపు

  • జ్యూరిచ్‌లో తెలుగు డయాస్పోరాతో సీఎం చంద్రబాబు భేటీ
  • ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎన్నార్టీలు ఎదగాలని పిలుపు
  • ఎన్నార్టీల కోసం రూ. 50 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన
  • విదేశీ విద్య అభ్యసించేవారికి ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు ఇస్తామని హామీ
  • ఏపీకి భారీగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తెలుగు ప్రజలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని, అప్పుడే తెలుగు జాతి సంపూర్ణంగా అభివృద్ధి చెందినట్లు తాను భావిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. దావోస్ పర్యటనలో భాగంగా తొలిరోజు జ్యూరిచ్‌లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 20 దేశాల నుంచి కుటుంబాలతో సహా హాజరైన ప్రవాసాంధ్రులతో ఆత్మీయంగా ముచ్చటించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారికి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "ఒకప్పుడు దావోస్‌కు వస్తే భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు ఇక్కడి వాతావరణం చూస్తుంటే విజయవాడలోనో, తిరుపతిలోనో ఉన్నట్లు అనిపిస్తోంది. ఇది ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది" అని అన్నారు. ప్రపంచంలోని 195 దేశాల్లో తెలుగువారు ఉన్నారని, 148 దేశాల్లో ఎన్నార్టీ వ్యవస్థను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. 

ఎన్నార్టీల కోసం రూ. 50 కోట్ల కార్పస్ ఫండ్

ప్రవాసాంధ్రులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. "భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే, ఒకరు ఉద్యోగం చేస్తూ మరొకరు వ్యాపారం ప్రారంభించండి. 'ఒన్ ఫ్యామిలీ-ఒన్ ఎంటర్‌ప్రెన్యూర్' అనేది మన విధానం. ఏపీలో వ్యాపారాలకు అపార అవకాశాలున్నాయి" అని సూచించారు. ఎన్నార్టీలను ప్రోత్సహించేందుకు రూ. 50 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా అవసరమైన మార్గనిర్దేశం చేస్తామని హామీ ఇచ్చారు.

"గతంలో నేను విజన్ 2020, ఐటీ గురించి మాట్లాడినప్పుడు చాలామంది విమర్శించారు. కానీ ఆనాటి నిర్ణయాల వల్లే నేడు తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది, అని ధీమా వ్యక్తం చేశారు. లోకేశ్, రామ్మోహన్ నాయుడు వంటి యువతకు ప్రభుత్వంలో, పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

ఏపీకి పెట్టుబడుల వెల్లువ

 రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడంపై మాట్లాడుతూ, "విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించడం సాధ్యమా అని చాలామంది ఆందోళన చెందారు. కానీ కేవలం 18 నెలల కాలంలోనే రాష్ట్ర బ్రాండ్‌ను పునరుద్ధరించాం. 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానంతో ముందుకు వెళ్తున్నాం" అని వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయని తెలిపారు. గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్ (రూ. 1 లక్ష కోట్లు), ఏఎం గ్రీన్ (10 బిలియన్ డాలర్లు) వంటి భారీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని పేర్కొన్నారు. "ప్రస్తుతం రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడులపై కసరత్తు చేస్తున్నాం. ఇది పూర్తయితే 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి" అని చెప్పారు.

టెక్నాలజీతో సరికొత్త భవిష్యత్తు 

భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చంద్రబాబు తెలిపారు. "లిచెన్‌స్టైన్ లాంటి చిన్న దేశం టెక్నాలజీతోనే సంపన్న దేశంగా మారింది. అందుకే మనం కూడా క్వాంటం, ఏఐ, స్పేస్, డ్రోన్ టెక్నాలజీలను ప్రోత్సహిస్తున్నాం" అని అన్నారు. డ్రోన్ల ద్వారా వ్యవసాయ, వైద్య రంగాల్లో సేవలు అందిస్తామని, డ్రోన్ ఆపరేషన్లకు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసే బాధ్యతను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీసుకోవాలని కోరారు. ఎలక్ట్రానిక్స్, హెల్త్ డివైసెస్, ఫార్మా రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.

విదేశీ విద్యకు ప్రభుత్వ గ్యారెంటీ 

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. "ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో చదువుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీతో 4 శాతం వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. చదువుకోవాలనుకునే ప్రతి ఒక్కరినీ చదివించడం మా బాధ్యత" అని ప్రకటించారు. తిరుపతిలో ఐఐటీ-ఐఐఎస్ఈఆర్ భాగస్వామ్యంతో 'ఏపీ ఫస్ట్' పేరుతో అత్యాధునిక పరిశోధన కేంద్రాన్ని స్థాపిస్తున్నట్లు వెల్లడించారు.

జ్యూరిచ్‌లో తెలుగు పండుగ వాతావరణం

ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. 20 ఐరోపా దేశాల నుంచి తరలివచ్చిన తెలుగు కుటుంబాలు ఉల్లాసంగా పాల్గొన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నార్టీలు అందించిన సహకారాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన సంక్రాంతి పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం తెలుగు కుటుంబాలను ఆత్మీయంగా పలకరించి, త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఏపీ ఎన్నార్టీ సొసైటీ అధ్యక్షుడు వేమూరి రవి తదితరులు పాల్గొన్నారు.


More Telugu News