సెంచరీలతో విరుచుకుపడిన డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్... భారత్ ముందు కష్టసాధ్యమైన లక్ష్యం

  • మూడో వన్డేలో భారత్‌కు 338 పరుగుల భారీ లక్ష్యం
  • 58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ న్యూజిలాండ్
  • నాలుగో వికెట్‌కు 219 పరుగులు జోడించిన డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్
  • కివీస్ స్కోరు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల
  • భారత బౌలర్లలో అర్ష్‌దీప్, హర్షిత్ రాణాకు చెరో మూడు వికెట్లు
టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) సెంచరీలతో విరుచుకుపడ్డారు. వీరిద్దరి అద్భుతమైన బ్యాటింగ్‌తో కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ ముందు 338 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యం నిలిచింది.

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు ఆరంభంలోనే కివీస్‌ను దెబ్బతీశారు. కేవలం 5 పరుగులకే ఓపెనర్లు డెవాన్ కాన్వే (5), హెన్రీ నికోల్స్ (0) పెవిలియన్ చేరారు. కాసేపటికే విల్ యంగ్ (30) కూడా ఔట్ కావడంతో న్యూజిలాండ్ 58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు ఏకంగా 219 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. మిచెల్ 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 137 పరుగులు చేయగా, ఫిలిప్స్ 88 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు సాధించాడు. ఆఖర్లో కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ 18 బంతుల్లో 28 పరుగులు చేసి స్కోరును మరింత పెంచాడు.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో మూడు వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌కు తలో వికెట్ దక్కింది.


More Telugu News