వెంకన్న మీద ఒట్టేసి లక్కీ డ్రా పేరిట మోసం... కరాటే కల్యాణి ఫిర్యాదు

  • రూ.399 కడితే ఫార్చ్యూనర్ కారు ఇస్తామంటూ ప్రచారం
  • సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రవీణ్, మహేందర్‌పై ఆరోపణలు
  • హైదరాబాద్‌ పంజాగుట్ట పీఎస్‌లో ఐటీ చట్టం కింద కేసు నమోదు
  • తిరుమల ప్రాంగణంలో ప్రచారం చేశారని ఫిర్యాదులో వెల్లడి
తిరుమల శ్రీవారి సన్నిధి సాక్షిగా కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు భారీ మోసానికి పాల్పడుతున్నారంటూ బీజేపీ నాయకురాలు, నటి కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్కీ డ్రా పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు.

వివరాల్లోకి వెళితే, ప్రవీణ్ కాస, సిద్ధమోని మహేందర్ అనే ఇద్దరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ మోసానికి పాల్పడుతున్నారని కరాటే కల్యాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం ₹399 చెల్లిస్తే లక్కీ డ్రాలో ఫార్చ్యూనర్ కారు, ఐఫోన్, టీవీ, బైక్ వంటి ఖరీదైన బహుమతులు గెలుచుకోవచ్చని వీరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

అంతేకాకుండా, అత్యంత పవిత్రమైన తిరుమల ఆలయ ప్రాంగణాన్ని ఈ మోసపూరిత ప్రచారానికి వాడుకున్నారని, ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లక్కీ డ్రా ద్వారా ఇప్పటికే నిందితులు ప్రజల నుంచి కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపించారు.

కరాటే కల్యాణి ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై ఐటీ చట్టం 2008లోని సెక్షన్ 318(4), సెక్షన్ 66 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.


More Telugu News