రాజ్యసభ పదవి.. దిగ్విజయ్ సింగ్ కీలక నిర్ణయం

  • మూడోసారి రాజ్యసభకు పోటీ చేయడం లేదని వెల్లడి
  • ఏప్రిల్ 26న ముగియనున్న దిగ్విజయ్ పదవీ కాలం
  • దళితుడికి రాజ్యసభ కేటాయించాలని రాష్ట్ర ఎస్సీ శాఖ అధ్యక్షుడి విజ్ఞప్తి
కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజ‌య్ సింగ్ కీలక నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయన మూడోసారి రాజ్యసభ పదవిని కోరకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, తాను మూడోసారి రాజ్యసభకు పోటీ చేయ‌డం లేద‌ని వెల్లడించారు. రాజ్యసభ సీటును వదిలేది తన చేతుల్లో లేదని, కానీ సీటును ఖాళీ చేస్తున్నానని దిగ్విజయ్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ తో ఆయ‌న పదవీకాలం ముగియనుంది.

అయితే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ శాఖ అధ్య‌క్షుడు ప్ర‌దీప్ అహిర్‌వార్ ఈసారి అభ్యర్థించడంతో దిగ్విజయ్ సింగ్ సీటును త్యాగం చేయనున్నారని సమాచారం. షెడ్యూల్ కులాలకు చెందిన నేతను ఎగువ సభకు పంపించాలని కోరుతూ ప్రదీప్ అహిర్‌వార్ పార్టీ పెద్దలకు జనవరి 13న లేఖ రాశారు.

సామాజిక న్యాయం కోసం రాజ్యసభకు పార్టీ నుంచి దళితుడికి అవకాశం ఇవ్వాలని ఆయన లేఖలో కోరారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఎస్సీలు 17 శాతం ఉన్నట్లు అహిర్‌వార్ తెలిపారు.

కాగా, దిగ్విజయ్ సింగ్ 2014 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1993 నుంచి 2003 వరకు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.


More Telugu News