ముస్లిం అబ్బాయి ఆస్ట్రేలియా తరపున ఆడలేడన్నారు: రిటైర్మెంట్ వేళ ఖవాజా భావోద్వేగం

  • సిడ్నీలో జరిగే యాషెస్ ఐదో టెస్టు తర్వాత అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ఉస్మాన్ ఖవాజా వీడ్కోలు
  • ఆస్ట్రేలియా తరపున ఆడిన తొలి ముస్లిం టెస్ట్ క్రికెటర్‌గా గుర్తింపు
  • కెరీర్‌లో 16 సెంచరీలతో 6,206 పరుగులు సాధించిన ఖవాజా
  • తనపై వచ్చిన జాత్యహంకార విమర్శలపై ఆవేదన వ్యక్తం చేసిన స్టార్ బ్యాటర్
  • వలసదారులకు స్ఫూర్తిగా నిలిచానంటూ భావోద్వేగ వ్యాఖ్యలు
అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో యాషెస్ టెస్టు మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఆదివారం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌తో ఆయన 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలకనున్నాడు.

అద్భుతమైన కెరీర్
2011లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌పైనే టెస్టు అరంగేట్రం చేసిన ఖవాజా.. ఇప్పుడు అదే మైదానంలో, అదే ప్రత్యర్థిపై తన చివరి మ్యాచ్ ఆడనుండటం విశేషం. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జన్మించి, చిన్నప్పుడే ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన ఖవాజా.. ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి ముస్లిం క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 87 టెస్టులు ఆడిన ఆయన 43.39 సగటు, 16 సెంచరీలతో 6,206 ర‌న్స్‌ సాధించాడు. వన్డేలు, టీ20ల్లోనూ ఆసీస్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు.

జాత్యహంకార ధోరణిపై ఆవేదన
రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా ఖవాజా భావోద్వేగానికి లోనయ్యాడు. "నేనొక ముస్లింని, పాకిస్థాన్ నుంచి వచ్చిన నల్ల జాతీయుడిని. నేను ఆస్ట్రేలియా జట్టులో ఎప్పటికీ ఆడలేనని చాలామంది అన్నారు. కానీ, ఇప్పుడు నన్ను చూసి మీరూ సాధించవచ్చని నమ్ముతున్నా" అని అన్నాడు. అయితే, ఇటీవల తనపై వచ్చిన విమర్శల పట్ల ఖ‌వాజా ఆవేద‌న‌ వ్యక్తం చేశాడు. పెర్త్ టెస్టులో గాయం కారణంగా ఇబ్బంది పడితే.. తాను సోమరిపోతునని, స్వార్థపరుడని, జట్టు పట్ల నిబద్ధత లేదని మీడియా, మాజీలు విమర్శించారని, ఇవి జాత్యహంకార ధోరణులేనని పేర్కొన్నాడు.

క్రికెట్ ఆస్ట్రేలియా ప్రశంసలు
ఖవాజా నిర్ణయంపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ టాడ్ గ్రీన్‌బర్గ్.. ఆసీస్ క్రికెట్‌కు ఆయన చేసిన సేవలను కొనియాడారు. మైదానంలో స్టైలిష్ బ్యాటర్‌గా, బయట ఉస్మాన్ ఖవాజా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవకుడిగా ఆయన ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.


More Telugu News