Narendra Modi: తనకు ప్రధాని ఆశీస్సులున్నాయంటూ ఈ-మెయిల్స్... కేసు నమోదు చేసిన సీబీఐ

తనకు ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు ఉన్నాయని, స్వదేశీ యుద్ధ విమానాల ఇంజిన్ల తయారీలో సహాయం చేస్తానని చెప్పి పలు రక్షణ, పరిశోధన సంస్థలకు ఈ-మెయిల్స్ పంపిన వ్యక్తిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకుంది.

వివరాల్లోకి వెళితే, దిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతానికి చెందిన నిశిత్ కోహ్లీ అనే వ్యక్తి ఈ వ్యవహారానికి పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది. నిందితుడు 2024 అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య కాలంలో డీఆర్‌డీవో, ఇస్రో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) వంటి కీలక సంస్థలతో పాటు అమెరికాలోని పెంటగాన్‌కు చెందిన ఓ నేవీ అధికారికి కూడా ఈ-మెయిల్స్ పంపాడు. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా తన అర్హతలను ధ్రువీకరించారని, ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఆశీర్వాదం ఉందని ఆ మెయిల్స్‌లో పేర్కొన్నాడు.

ఈ ఈ-మెయిల్స్‌ను గుర్తించిన పీఎంఓ అధికారులు, ప్రధాని పేరును వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని భావించి సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ, నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ చర్యల వెనుక నిందితుడి అసలు ఉద్దేశాలను తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు.
Narendra Modi
PMO
CBI investigation
Nishith Kohli
DRDO
ISRO
Hindustan Aeronautics Limited
Swadeshi warplanes
Defense research
Email fraud

More Telugu News