బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త... దేశవ్యాప్తంగా ఉచిత వైఫై కాలింగ్ సేవలు

  • జనవరి 1 నుంచి వైఫై కాలింగ్ సేవలను ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్
  • ఇక ఇండోర్ ప్రాంతాల్లో, బేస్‌మెంట్‌లలో సిగ్నల్ కష్టాలకు చెక్
  • ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ఉచితంగా వైఫై కాలింగ్ సేవలు
  • ప్రత్యేక యాప్ అవసరం లేకుండానే నేరుగా ఫోన్ డయలర్ నుంచి కాల్స్
  • నెట్‌వర్క్ ఆధునికీకరణలో భాగంగా బీఎస్ఎన్ఎల్ కీలక ముందడుగు
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ కస్టమర్ల కోసం కీలకమైన సేవను అందుబాటులోకి తెచ్చింది. జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా వాయిస్ ఓవర్ వైఫై (VoWiFi) సేవలను ప్రారంభించింది. ఈ సేవలు బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే అందుబాటులో ఉంటాయి. మొబైల్ సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్యను అధిగమించేందుకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి.

మొబైల్ సిగ్నల్ సరిగా లేని బేస్‌మెంట్‌లు, బహుళ అంతస్తుల భవనాల లోపలి భాగాలు, మారుమూల ప్రాంతాల్లో స్పష్టమైన వాయిస్ కాల్స్ అందించడమే ఈ టెక్నాలజీ ప్రధాన లక్ష్యం. వినియోగదారులు తమకు అందుబాటులో ఉన్న బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ లేదా ఇతర ఏదేని వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించి, తమ ఫోన్‌లోని సాధారణ డయలర్ నుంచే నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను ఆధునికీకరించే కార్యక్రమంలో భాగంగానే ఈ వాయిస్ ఓవర్ వైఫై సేవలను తీసుకొచ్చినట్లు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. "దేశవ్యాప్తంగా, ముఖ్యంగా సరైన సేవలు లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు" అని పేర్కొంది.

ఈ సేవలను పొందడానికి వాయిస్ ఓవర్ వైఫైకి సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ఉంటే సరిపోతుంది. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'వైఫై కాలింగ్' ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త సేవతో బీఎస్ఎన్ఎల్ కూడా జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా వంటి ప్రైవేట్ టెల్కోల సరసన చేరినట్లయింది.


More Telugu News